సికింద్రాబాద్, అక్టోబర్ 4: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తం చేసేందుకు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. సంక్షేమం, అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. మంగళవారం మారేడ్పల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో లబ్ధిదారులకు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి నూతన ఆసరా పింఛన్ కార్డులను ఎమ్మెల్యే సాయన్న పంపిణీ చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తమైతే ప్రపంచంలోనే దేశం నంబర్వన్ అవుతుందన్నారు. దేశంలో తెలంగాణను నంబర్వన్గా తీర్చిదిద్దిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని అనేక రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
తెలంగాణ ఏర్పడ్డాక ఎనిమిదేండ్లలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. పింఛన్లు తీసుకుంటున్నోళ్లు కేసీఆర్ను మరిచిపోరన్నారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేని కొందరు కుల, మతాల పేరుతో చిచ్చుపెడుతున్నారని దుయ్యబట్టారు. ఇక్కడ అమలవుతున్న పథకాలన్నీ తమ రాష్ట్రాల్లో అమలు చేయాలనే డిమాండ్ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ఆదరణ కేసీఆర్ పరిపాలనా దక్షతకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో మండ ల తహసీల్దార్ మాధవిరెడ్డితో పాటు మండల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
‘జాతీయ’ సంబురాలను ఘనంగా నిర్వహించాలి
దసరా పండుగను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ప్రకటించనున్న జాతీయ పార్టీ సందర్భంగా కంటోన్మెంట్ వ్యాప్తంగా సంబురాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే సాయన్న పిలుపునిచ్చారు. మారేడ్పల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే నేతలకు పలు సూచనలు చేశారు. నియోజకవర్గంలోని ప్రతి బస్తీ, కాలనీతో పాటు సంబురాలు అంబరాన్నంటాలన్నారు. ప్రతి కార్యకర్త, పార్టీ ముఖ్యులు జాతీయ సంబురాల్లో పాల్గొని, ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతుగా నిలవాలని పేర్కొన్నారు.
బస్తీలతో పాటు కాలనీల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలతో పాటు బాణాసంచా కాల్చడంతో పాటు మిఠాయిలు పంపిణీ చేయాలని దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, నళినికిరణ్, నేతలు నివేదిత, టీఎన్ శ్రీనివాస్, సంతోష్, మురళీయాదవ్, భాస్కర్ ముదిరాజ్ పాల్గొన్నారు.