బంజారాహిల్స్, సెప్టెంబర్ 25: ప్రతిష్టాత్మక ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్సీసీ) ఎన్నికల్లో నిర్మాత కేఎల్. నారాయణ ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఆదివారం నిర్వహించిన పోలింగ్లో 1991 ఓట్లకు గాను 1324 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. కాగా, కేఎల్.నారాయణ ప్యానెల్ తరఫున రెండోసారి అధ్యక్ష బరిలో నిలిచిన నిర్మాత జి.ఆదిశేషగిరావు తన సమీప ప్రత్యర్థి సురేశ్పై విజయం సాధించారు.
నిర్మాత కేఎస్.రామారావు ప్యానెల్ తరఫున బరిలో దిగిన వారంతా ఓటమి పాలయ్యారు. కార్యదర్శిగా బరిలోకి దిగిన కేఎస్.రామారావు మీద ముళ్లపూడి మోహన్ ఘన విజయం సాధించగా.. ఉపాధ్యక్షుడిగా తుమ్మల రంగారావు, కోశాధికారిగా బి.రాజశేఖర్రెడ్డి, జాయింట్ సెక్రటరీగా వీవీఎస్.పెద్దిరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రమోటీ కమిటీ సభ్యులుగా కాజా సూర్యనారాయణ, జుజాల శైలజ. ఏ.గోపాల్రావు, జె. బాలరాజు గెలుపొందారు. శాశ్వత కమిటీ సభ్యులుగా సామా ఇంద్రపాల్రెడ్డి, మోహన్ వడ్లపట్ల, ఏడిద సతీశ్ రాజా, సీహెచ్. వరప్రసాదరావు విజయం సాధించారు. కొత్త కమిటీ 2024 వరకు పనిచేస్తుందని ఎన్నికల అధికారి కేవీఆర్. చౌదరి ప్రకటించారు.