రవీంద్రభారతి,సెప్టెంబర్ 25: తెలంగాణ సాహిత్యం, రాజకీయ చైతన్యానికి ప్రతీక సురవరం ప్రతాప్రెడ్డి అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. గోల్కొండ సాహితి కళా సమితి, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలుగు రాష్ర్టాల్లోని 126 మంది కవులతో రూపొందించిన కవితా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరీశంకర్ మాట్లాడుతూ నిజాం అరాచకాలను తన పత్రిక ద్వారా వెలుగులోకి తెచ్చి తెలంగాణ ప్రజలను చైతన్యం చేసిన గొప్ప మహనీయుడన్నారు. గోల్కొండ సాహితీ కళా సమితి అధ్యక్షుడు డాక్టర్ అర్ధ చంద్ర ప్రకాష్రెడ్డి సభా అధ్యక్షత వహించిన కార్యక్రమంలో తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి, సురవరం కుమారుడు డాక్టర్ కృష్ణవర్ధన్రెడ్డి, తెలంగాణ భాష చైతన్య సమితి అధ్యక్షుడు బడేసాబ్, గంటా మనోహర్రెడ్డి, పాల్గొన్నారు. అంతకుముందు ప్రముఖ కవి రామకృష్ణ చంద్రమౌళి నిర్వహించిన కవి సమ్మేళనం ఆకట్టుకున్నది.