బడంగ్పేట, సెప్టెంబర్ 25: దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటికి మంచి నీటి సరఫరా చేయిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ 25వ డివిజన్ రాజీవ్ గృహకల్పలో సీసీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. నాదర్గుల్లోని శ్రీకృష్ణానగర్, మాతృశ్రీ నగర్, వైకుంఠపురం కాలనీ, ప్లాటీనం సిటీ వెంకటాద్రి నివాస్, రఘుహోమ్స్ కాలనీ, లక్ష్మీనగర్ కాలనీలకు మిషన్ భగీరథ నీటిని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కాలనీలో మంచి నీటి సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 1200 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, డీఈఈ జ్యోతి, కార్పొరేటర్లు ముత్యాల లలిత కృష్ణ, ఇంద్రసేన, నిమ్మల శ్రీకాంత్ గౌడ్, తోట శ్రీధర్, సూర్ణగంటి అర్జున్ తదితరులు పాల్గొన్నారు.