మన్సూరాబాద్, సెప్టెంబర్ 25: కురుమ కులానికి చెందిన సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఓ వ్యక్తి ప్రభుత్వ పాఠశాలలో చదివి హైకోర్టు జడ్జి స్థాయికి ఎదగడం ఎంతో అభినందనీయమని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిగా నియమితులైన పుల్ల కార్తీక్ అభినందన సభను ఆదివారం తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం కురుమ ఆధ్వర్యంలో మన్సూరాబాద్లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి హెచ్ఎం రేవన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశంతో కలిసి రాష్ట్ర హైకోర్టు జడ్జి పుల్ల కార్తీక్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. కష్టపడి క్రమశిక్షణతో చదివితే ఏదైనా సాధించవచ్చునని, జడ్జిగా నియమింపబడిన పుల్ల కార్తీక్ రుజువు చేశారని తెలిపారు. చదువు కోవడం ద్వారా ఏదైనా సాధించవచ్చునని పేర్కొన్నారు.
లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ముందుకు సాగాలి హైకోర్టు జడ్జి పుల్ల కార్తీక్
జీవితంలో ధనం ముఖ్యం కాదని.. విజ్ఞానం సాధించగలిగితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని హైకోర్టు జడ్జి పుల్ల కార్తీక్ తెలిపారు. మా అమ్మ, నాన్నలు చదువుకోకున్నా నన్ను కష్టపడి చదివించారని తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ఈ స్థాయికి ఎదగగలిగానని తెలిపారు. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చునని పేర్కొన్నారు. హైకోర్టు జడ్జిగా నియమింపబడినందుకు సంతోషంగా ఉన్నదన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పేదలకు న్యాయం చేస్తానని తెలిపారు.
హైకోర్టు జడ్జి పుల్ల కార్తీక్ను చూసి గర్వపడుతున్నాం ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం కురుమ స్వశక్తితో హైకోర్టు జడ్జి స్థాయికి ఎదిగిన పుల్ల కార్తీక్ను చూసి గర్వపడుతున్నామని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం కురుమ తెలిపారు. పుల్ల కార్తీక్ను స్ఫూర్తిగా తీసుకుని కురుమ యువత ముందుకు సాగాలని సూచించారు. యెగ్గె మల్లేశం కురుమ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ కురుమ, ప్రతినిధులు క్యామ మల్లేశ్, రెక్కాల కొండల్ రాజ్, కోలోపుల నర్సింహ, ఎక్కాల కన్నా, చీర శ్రీకాంత్, కట్టా మల్లేశ్, తూంకుంట అరుణ్కుమార్, కెండ్యాల శ్రీనివాస్, చెలిమెల్లి ప్రమోద్, తమగొండ బాలమణి, వస్పరి శంకర్, దేవర రాజేశ్వర్, కృష్ణమూర్తి, నర్సా వినోద్, బురుగడ్డ నగేశ్, సెవెల్లి సంపత్, మిరియాల విజయలత తదితరులు పాల్గొన్నారు.