సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో మరే ఇతర మెట్రో నగరాల్లో ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఏర్పాటు చేయని విధంగా కోకాపేటలో భారీ లేఅవుట్ను నియోపోలీస్ (ఎస్ఈజెడ్-స్పెషల్ ఎకనామిక్ జోన్) పేరుతో హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తోంది. సుమారు 530కి పైగా ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును హెచ్ఎండీఏ చేపట్టింది. 150, 120 అడుగుల వెడల్పుతో విశాలైన రోడ్లు, అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్, తాగునీరు, డ్రైనేజీ లైన్లను అత్యాధునిక తరహాలో ఏర్పాటు చేస్తున్నారు. నిరంతర విద్యుత్ సరఫరాకు లేఅవుట్లోనే 400కేవీ సబ్ స్టేషన్ కోసం 5.3 ఎకరాలు, జలమండలి నిర్మించే తాగునీటి పంప్హౌస్ కోసం మరో 9.30 ఎకరాలు కేటాయించి లేఅవుట్ను అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం రూ.300 కోట్లను వెచ్చిస్తున్నారు. నగరం పరిధిలో ఉండే ఈ లేఅవుట్లో ఎలాంటి జోనల్ పరిమితులు లేకుండా మల్టీ యూజ్ జోన్ (బహుళ వినియోగ)గా కోకాపేట లేఅవుట్ను హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అభివృద్ధి చేస్తోంది. ఈ లేఅవుట్లో చేపడుతున్న పనులను శనివారం రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ప్రత్యేకంగా పరిశీలించారు. హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి కోకాపేట నియోపోలీస్ లేఅవుట్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రికి వివరించారు.
గ్రీన్ ఫీల్డ్ వర్క్స్పేస్ టౌన్ షిప్లా హెచ్ఎండీఏకు చెందిన సుమారు 530 ఎకరాలు మినహాయిస్తే, దాని చుట్టు పక్కల అనుకొని భూముల్లోనూ ఇప్పటికే భారీ సంఖ్యలో హైరైజ్ బిల్డింగ్లు 30 నుంచి 57 అంతస్తుల వ్యాపార, వాణిజ్య భవనాలతో పాటు గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులే అత్యధికంగా ఉన్నాయి. ప్రస్తుతం కోకాపేటలో 40కి పైగా హైరైజ్ అపార్టుమెంట్ల నిర్మాణాలు హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు పక్కనే ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల దృష్టంతా ఇప్పుడే కోకాపేట మీదే ఉంది. ఐటీ పరంగా మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, నానక్రాంగూడ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు తగ్గిపోవడంతో ఇప్పుడంతా కోకాపేటపైనే ఐటీ కంపెనీలు దృష్టిసారించాయి. దానికి అనుగుణంగానే కోకాపేటలో మౌలిక వసతులను కల్పిస్తున్నామని పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్కుమార్ తెలిపారు. కోకాపేట ప్రాంతంలోనే వచ్చే ఐదేళ్లలో 10 లక్షల మంది పని చేసుకునేలా అత్యాధునిక మౌలిక వసతులు కల్పించేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తోందన్నారు.