కేపీహెచ్బీ కాలనీ, సెప్టెంబర్ 24:ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ. ఆడపడచులంతా ఆట, పాటలతో జరిగే బతుకమ్మ సంబురాలు రాష్ట్రంలో అశ్వయుజ అమావాస్య రోజున ఎంగిలిపూలతో ప్రారంభమై.. తొమ్మిది రోజుల తర్వాత సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. కానీ కూకట్పల్లిలో గ్రామ ఆచారం ప్రకారం అమావాస్యకు ముందు రోజునే బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి.శనివారం సాయంత్రం కూకట్పల్లి హనుమాన్ దేవాలయంతో పాటు పురవీధుల్లో ఆడపడచులు
బతుకమ్మ ఆటాపాటలతో సందడి చేశారు. రంగురంగు పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక్కచోటికి చేర్చి ఆడపడచులంతా కలిసి శ్రీరామరామ ఉయ్యాలో.. జయరామరామ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ.. లయబద్ధంగా రెండు అరచేతులతో చప్పుళ్లు చేస్తూ.. కాళ్లను కదుపుతూ బతుకమ్మ ఆటలాడారు. అనంతరం బతుకమ్మలను గౌరమ్మలను చెరువు వద్దకు తీసుకెళ్లి అక్కడ కొద్దిసేపు బతుకమ్మ ఆటాడి బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు. ఫలహారాన్ని పంచుకుని అందరూ కలిసి సందడిగా వేడుకలు జరుపుకున్నారు. అలాగే ఆదివారం నుంచి దసరా సెలవులు కావడంతో నగరంలో పలు విద్యాసంస్థల్లో శనివారమే బతుకమ్మ వేడకలు నిర్వహించారు.
బేగంపేట్లోని బ్రాండ్ సీఏఐ చీఫ్ ఇన్స్ట్రక్టర్ సయ్యద్ అబ్దుల్ అతీఖ్ పర్యవేక్షణలో పీజీ విద్యార్థులు అనిల్, ఉదయ్, ఆదిత్యగిరి, వికాస్ పాణిగ్రాహి, స్పర్ష్ శర్మలు దాదాపు 5 గంటల పాటు శ్రమించి 8 ఐస్ బ్లాకుల(400 కేజీలు)తో 10 అడుగుల
ఎత్తు ఐస్ బతుకమ్మను తయారు చేశారు. సంప్రదాయ తంగెడు పూలతో పాటు విద్యుత్ దీపాలతో చక్కగా అలంకరించిన బతుకమ్మ చూపరులను ఆకట్టుకుంటోంది.