మలక్పేట, సెప్టెంబర్ 24: ఆనందంగా సాగుతున్న ఆ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. నెలరోజుల్లోపే తల్లి, కూతురు మరణం తీరని విషాదాన్ని నింపింది. మలక్పేటలోని పోచమ్మ దేవాలయం వెనుక వీధిలో నివసించే విశ్వం పోలీస్ శాఖ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్లో అధికారి. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు శ్రావణి (27) హస్తినాపురంలోని ఓ ప్రైవేటు దవాఖానలో డెంటిస్ట్గా పనిచేస్తుండగా, కుమారుడు బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. 25 రోజుల కిందట విశ్వం భార్య గుండెపోటుతో మరణించింది. ఈ బాధ నుంచి కోలుకోకముందే మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 20న కూతురు శ్రావణి డ్యూటీకి వెళ్లి సాయంత్రం తిరుగు ప్రయాణంలో ఓలా బైక్ను బుక్ చేసుకున్నారు. రైడర్ మెరుగు వెంకటయ్య (34) ఆమెను పికప్ చేసుకొని మలక్పేటకు వెళ్తుండగా, మూసారాంబాగ్ పీవీఆర్ మాల్ వద్ద వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన కారు వీరి బైక్ను ఢీకొట్టి వెళ్లిపోయింది. వెంకటయ్యకు కాళ్లు, చేతులకు గాయాలవ్వగా, శ్రావణి తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రులను మలక్పేటలోని యశోద దవాఖానకు తరలించారు. శ్రావణిని వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్సకోసం కుటుంబసభ్యులు నిమ్స్లో చేర్పించారు. నాలుగురోజులుగా మృత్యువుతో పోరాడిన ఆమె శనివారం తెల్లవారు జామున చనిపోయారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ప్రమాదానికి కారణమైన కారును గుర్తించిన పోలీసులు నిందితుడు ఇబ్రహీం(19)ను అదుపులోకి తీసుకున్నారు. అతడి కారుకు లైసెన్స్, ఎలాంటి పత్రాలు లేనట్లు గుర్తించి.. వివిధ సెక్షన్లకింద కేసులు నమోదు చేశారు.