సిటీబ్యూరో, సెప్టెంబరు 24 (నమస్తే తెలంగాణ): అది వాణిజ్య కూడలి.. క్షణం తీరిక లేకుండా రయ్మంటూ దూసుకెళ్లే వాహనాలు..నిత్యం లక్షలాది మంది రోడ్డు దాటే ప్రదేశం..తరుచూ ప్రమాదాలు.. ఈ క్రమంలో పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం-జీహెచ్ఎంసీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సన్నాహాలు మొదలుపెట్టింది. పాదచారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ జీవీకే మాల్ వద్ద రూ.5 కోట్ల అంచనా వ్యయంతో త్రీడీ టెక్నాలజీతో నిర్మించనున్న ఈ బ్రిడ్జితో తరుచూ జరిగే ప్రమాదాలకు అడ్డుకట్ట పడనుంది. పాదచారులను దృష్టిలో ఉంచుకొని గ్రేటర్వ్యాప్తంగా తలపెట్టిన 43 ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాల్లో ఇప్పటికే 21 పూర్తవగా, మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. సుమారు రూ.33 కోట్లతో తలపెట్టిన 12 జంక్షన్ల అభివృద్ధి, సుందరీకరణ ప్రక్రియలోనూ పలు పనులకు టెండర్లు పూర్తయ్యాయి.
త్రీడీ టెక్నాలజీతో నిర్మించనున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్రత్యేకతలు..
ఎం.ఎస్ (మైల్డ్ స్టీల్) స్టీల్తో సుమారు 55 (54.97) మీటర్ల విస్తీర్ణంతో చేపట్టే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో ప్రజలు సులభతరంగా రోడ్డు దాటే అవకాశం ఉంటుంది.
రెండువైపులా ఎస్కలేటర్తో పాటు పది మంది వెళ్లే సామర్థ్యంతో రెండు లిఫ్టులు
ఎనిమిది సీసీ కెమెరాలు ఫుట్పాత్ అంచున సీలింగ్, క్లాడింగ్