తెలంగాణ ప్రభుత్వం మానవత్వమున్న సర్కారని నిరూపించుకుంటున్నది. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంపై దృష్టి పెట్టి అక్కడి సమస్యలను పరిష్కరిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో గ్రేటర్ చెత్తకు డంపింగ్ కేంద్రంగా ఉన్న జవహర్నగర్పై దృష్టి పెట్టింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి విముక్తి కల్పించేందుకు కంకణం కట్టుకుంది. సాధారణ పరిస్థితి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. 330 ఎకరాల్లో విస్తరించి ఉన్న జవహర్నగర్ డంపింగ్ యార్డులో 135 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో టన్నుల కొద్దీ చెత్త గుట్టలపై రూ.250 కోట్లతో క్యాపింగ్ పనులు చేపట్టి పూర్తి చేసింది. డంపింగ్ యార్డు నుంచి వచ్చే కాలుష్య నీటితో వర్షం నీరు కలువకుండా రూ.1.83 కోట్లతో డైవర్షన్ ఛానల్, పర్క్యులేషన్ ట్యాంకుల నిర్మాణాన్ని అధికారులు చేపట్టారు. అంతేకాక గతంలో చెత్త గుట్టలతో దర్శనమిచ్చే ఈ ప్రాంతాన్ని పచ్చదనానికి కేరాఫ్ అడ్రస్గా మార్చారు. ప్రస్తుతం అక్కడికి తరలిస్తున్న చెత్తను గ్రేడింగ్తో పాటు రీసైక్లింగ్ చేస్తూ ఏకంగా వెయ్యి మెగావాట్ల విద్యుత్ను సైతం ఉత్పత్తి చేస్తున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ, జవహర్నగర్ మున్సిపల్ అధికారులతో కలిసి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ బుధవారం జవహర్నగర్ డంపింగ్ యార్డును సందర్శించారు. యార్డు పరిసరాల్లో ఉన్న మల్కారం చెరువు శుద్ధి కోసం రూ.250 కోట్లతో చేపట్టిన పనులను ఆయన పరిశీలించారు. ఆరు నెలల్లో చెరువు నీటిని శుద్ధి చేస్తామని ప్రకటించారు.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 21 (నమస్తే తెలంగాణ)
జవహర్నగర్.. ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని నగర చెత్తకు కేంద్రమిది. ఏండ్ల తరబడి పేరుకుపోయిన చెత్తతో జవహర్నగర్ మాత్రమే కాదు.. దమ్మాయిగూడ, నాగారం ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా మారాయి. అప్పటి పాలకులు చెత్త గుట్టలను పెంచారు తప్ప ప్రజలకు సాధారణ జీవనాన్ని సాగించే హక్కును మాత్రం కల్పించలేదు. కానీ.. తెలంగాణ ప్రభుత్వం కాలుష్యంలో మగ్గుతున్న ఆ ప్రాంతానికి విముక్తి కల్పించేందుకు కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే చెత్త గుట్టల్ని మాయం చేసి.. హరితాన్ని పెంపొందించిన ప్రభుత్వం ఇకపై చుక్క కలుషిత నీరు కూడా భూగర్భంలోకి చేరకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా ఈ మూడు ప్రాంతాల్లోని ప్రజలకు ఉచిత తాగునీటి పథకాన్ని కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మూడు ప్రాంతాలకు చెందిన స్థానిక సంస్థల దగ్గర నిధులు లేకున్నా.. ప్రభుత్వం నేరుగా నిధులిచ్చి ఆ ప్రాంతాలకు శాశ్వత విముక్తి కల్పిస్తున్నది.
జవహర్నగర్ డంపింగ్ యార్డు ప్రాంగంణంలో పేరుకుపోయిన కాలుష్య కారక వ్యర్థాలు (లీచెట్) శుద్ధికి జీహెచ్ఎంసీ చర్యలు ముమ్మరం చేసింది. తొలి దశలో రెండు వేల లీటర్లు..ఆనంతరం సామర్థ్యాన్ని పెంచుతూ శుద్ధి చేసి జవహర్నగర్ పరిసర ప్రాంతాలతో పాటు మల్కారం చెరువును శుద్ధి చేసేందుకు దాదాపు రూ. 250 కోట్లతో పనులు చేపట్టారు. ప్రజల విజ్ఞప్తి మేరకు మొబైల్ రిసోర్స్అస్మోసిస్ (ఆర్ఓ) ప్లాంట్ ఏర్పాటు చేసి ప్లేట్ అండ్ ట్యూబ్-అడ్వాన్స్డ్ రివర్స్ అస్మోసిస్ మెంబ్రేన్ సిస్టం ద్వారా లీచెట్ శుద్ధి చేయనున్నారు. కుంటల్లో లీచెట్ లేకుండా పూర్తి స్థాయి స్వచ్ఛమైన నీరు ఉండేలా చేయాలన్న లక్ష్యంతో లీచెట్ శుద్ధి కేంద్రం పనులు చేపట్టారు.
జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీల పరిధిలో రక్షిత తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.209.63 కోట్లతో తాగునీటి పైప్లైన్ వ్యవస్థ, రిజర్వాయర్ల నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ మూడు ప్రాంతాల పరిధిలో 19.55 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో 25 రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇందుకోసం 500 కిలోమీటర్లకు పైగా పైప్లైన్లు వేస్తున్నారు. అయితే సంవత్సరాల తరబడి ఈ ప్రాంతాలు కాలుష్య భూగర్భజలాలతో మగ్గిపోయినందున గ్రేటర్ పరిధిలో మాదిరిగానే ఇక్కడ కూడా 20వేల లీటర్ల ఉచిత మంచినీటి తాగునీటి పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
వర్షపు నీటిని మళ్లించేందుకుగాను మూడు స్థానిక సంస్థల పరిధుల్లో 14.86 కిలోమీటర్ల మేర వాననీటి మళ్లింపు నిర్మాణాలు (స్ట్రామ్ వాటర్ డ్రెయిన్స్)ను చేపడుతున్నారు. జవహర్నగర్ పరిధిలో ఆరు కిలోమీటర్లు, దమ్మాయిగూడ పరిధిలో 6.2 కిలోమీటర్లు, నాగారం పరిధిలో మరో 2.66 కిలోమీటర్ల మేర డ్రైయిన్స్ను నిర్మిస్తున్నారు. దీంతో పాటు భూగర్భ డ్రైనేజీ కోసం రూ.20.42 కోట్లను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. వీటితో పాటు స్థానిక సంస్థల పరిధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం, చెరువుల సుందరీకణ పనులు కూడా చేపడుతున్నారు.
తెలంగాణ ఏర్పడే వరకు డంపింగ్ యార్డుగా మాత్రమే చూసే ఈ ప్రాంతానికి తెలంగాణ ప్రభుత్వం విముక్తితో పాటు మౌలిక సదుపాయాల్ని కల్పిస్తుంది. ఇందులో భాగంగా 26.15 కిలోమీటర్ల మేర జవహర్నగర్లో నాలుగు, దమ్మాయిగూడలో రెండు, నాగారం పరిధిలో మరో నాలుగు లింకు రోడ్లను రూ.331.80 కోట్లతో నిర్మిస్తున్నారు. దీంతో నిన్నటిదాకా ఈ ప్రాంతాల పరిధిలో ఇండ్లు కొనేందుకు వెనుకాడే వారు ఇప్పుడు సాధారణ పరిస్థితులతో పాటు మెరుగైన మౌలిక వసతులు వస్తున్నందున ప్లాట్లు, గృహాలు కొనేందుకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ గతంలో కంటే భూములు, గృహాల ధర గణనీయంగా పెరిగింది.
సుమారు 330 ఎకరాల్లో విస్తరించి ఉన్న జవహర్నగర్ డంపింగ్ యార్డులో 135 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో టన్నులకొద్దీ చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. చుట్టుపక్కల కిలోమీటర్ల కొద్దీ దుర్వాసన వెదజల్లడంతో పాటు భూగర్భజలాలు కలుషితమయ్యాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశుధ్య వ్యవస్థను ప్రక్షాళన చేసింది.