మేడ్చల్, సెప్టెంబర్21 (నమస్తే తెలంగాణ): మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అన్ని రంగాల్లోనూ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా అధికారులు కృషి చేయాలన్నారు.
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దినట్లు మంత్రి తెలిపారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ. 7, 200 కోట్ల నిధులను కేటాయించి అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. దీంతో, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు. జిల్లాలో ఉన్న గురుకులాల్లో మంచి సౌకర్యాలు కల్పించడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గురుకుల పాఠశాలలో సమస్యలు తలెత్తకుండా అధికారులు తనిఖీలు చేయాలని మంత్రి ఆదేశించారు.
సీఎం కేసీఆర్ కృషి వల్లే జిల్లా అభివృద్ధి సాధించిందని జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి అన్నారు. జిల్లాలో అన్ని కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా నిర్మించిన రైతు వేదికలు ఉపయోగపడే విధంగా రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. ఉద్యానవన పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని, ఉద్యానవన పంటలు సాగుచేసేలా ఆ శాఖ ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.
వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి, వైద్య, ఆరోగ్యశాఖ, పంచాయితీ, మత్స్యశాఖ, అటవీశాఖలతో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాంసన్, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, డీసీసీబీ వైస్చైర్మన్ మధుకర్రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ సీఈవో దేవసహాయం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.