శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 18: స్వామి వివేకానంద వంటి మహనీయులను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెం. వెంకయ్య నాయకుడు సూచించారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ గ్రామ పరిధిలోని స్వర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్పాహార పథకాన్ని ప్రారంభించిన తమిళనాడు సీఎం స్టాలిన్ చొరవను ఆయన అభినందించారు. మిగితా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవతీసుకొని ఈ పథకాన్ని ప్రారంభించాలన్నారు. స్వర్ణభారత్ ట్రస్టు, సికింద్రాబాద్ కిమ్స్ దవాఖాన సహకారంతో వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో ఎంతో మందికి వైద్య సేవలందించారని తెలిపారు. కార్యక్రమంలో కిమ్స్ దవాఖాన ఎండీ డాక్టర్ భాస్కర్రావు, స్వర్ణభారత ట్రస్టు హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు సి.కృష్ణప్రసాద్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.