సిటీబ్యూరో, సెప్టెంబర్ 10(నమస్తే తెలంగాణ)/చర్లపల్లి: తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు మొదలు పెట్టి 24 ఏండ్లు పూర్తి కావొస్తున్నప్పటికీ.. ఇంకా రైల్వే పనులు నత్తనడకన కొనసాగుతూనే ఉన్నాయి. మరికొన్ని ప్రాజెక్టులు మొదలు పెట్టి రెండు దశాబ్దాలవుతున్నాయి. అయినప్పటికీ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులన్నీ వచ్చే ఏడాది డిసెంబర్ వరకు పూర్తవుతాయంటున్నారు. ఇంకా రైల్వే ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఇంకెన్నాళ్లు సమయం పడుతుందో అన్న దాని మీద క్లారిటీ ఇవ్వడం లేదు. పైగా, కాజీపేట్లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కాని, తిరిగి మొండి చేయి చూపించి లాథోర్కు తరలించినా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఇప్పటికీ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. పైగా సకాలంలో పూర్తి కావాల్సిన రైల్వే ప్రాజెక్టులు ఆలస్యం అవుతాయంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వే ప్రాజెక్టుల కోసం ఏపీకి ఎక్కువ బడ్జెట్ కేటాయించి.. తెలంగాణ రాష్ర్టానికి తక్కువ నిధులు కేటాయించినప్పటికీ కేంద్ర మంత్రికి ఇది పట్టడం లేదన్న ఆరోపణలు అనేకం వస్తున్నాయి.
చర్లపల్లి రైల్వే టెర్మినల్ను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు చర్లపల్లి రైల్వే స్టేషన్ను శాటిలైట్ టెర్మినల్గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం చర్లపల్లి రైల్వే టెర్మినల్ను సందర్శించి రైల్వేస్టేషన్లో చేపట్టిన పనులను ఆయన దక్షణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, చర్లపల్లి రైల్వే స్టేషన్ను రూ.300 కోట్ల నిధులతో అత్యాధునిక హంగులతో నిర్మాణ పనులు చేపట్టామన్నారు. వచ్చే సంవత్సరం డిసెంబర్లోపు పనులు పూర్తి చేసి అందుబాటుల్లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. రైల్వే టెర్మినల్లో నాలుగు నూతన లెవల్ ప్లాట్ఫారాలతో పాటు 24 కోచ్లకు సంబంధించి ప్లాట్ ఫారంను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే, ప్రస్తుత ప్లాట్ఫారం ఎత్తును పెంచడంతో పాటు పూర్తి స్థాయిలో నీటి వసతి కల్పిస్తున్నామన్నారు.