అబిడ్స్, సెప్టెంబర్ 10 : వినాయక నిమజ్జనం సందర్భంగా రహదారులపై పేరుకు పోయిన చెత్తను సకాలంలో ఎత్తి వేసేందుకు గాను జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. వినాయక నిమజ్జన ప్రధాన ద్వారమైన అఫ్జల్గంజ్ నుంచి మొదలుకుని బషీర్బాగ్ చౌరస్తా వరకు ప్రసాదాల పంపిణీ, తాగునీటి సరఫరా చేసేందుకు వేదికలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రసాదాలను పంపిణీ చేశారు. స్వాగత వేదికల ద్వారా పుష్పాలు చల్లడంతో రహదారుల నిండా గ్లాసులు, ప్లేట్లు, పుష్పాలు, చెత్తాచెదారం నిండిపోయింది. వర్షం కురువడంతో మార్గంలో బురదమయంగా మారింది. జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది, స్వీపర్లు శనివారం తెల్లవారు జాము నుంచి రహదారులను ఊడ్చడం, పేరుకు పోయిన చెత్తను ఎత్తి వేయడం, వినాయక మండపాల వద్ద పూజా సామగ్రి వంటి వాటిని సకాలంలో ఎత్తివేసేందుకు గాను సిబ్బంది శ్రమ పడాల్సి వచ్చింది. జీహెచ్ఎంసీ పద్నాల్గవ సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ పి.శ్రీకాంత్రెడ్డి తమ సిబ్బందితో తెల్లవారు జాము నుంచి రోడ్లను ఊడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. సర్కిల్ పరిధిలోని అఫ్జల్గంజ్ నుంచి మొదలుకుని ట్యాంక్బండ్ వరకు ఈ రహదారులను ఊడ్చే కార్యక్రమం కొనసాగింది. శనివారం వాహనదారుల రాక పోకలకు ఇబ్బందులు లేకుండా చూశారు.
పరిశీలించిన ఏఎంఓహెచ్లు ..
వినాయక నిమజ్జనం సందర్భంగా రహదారులపై పేరుకు పోయిన చెత్తను యుద్ధప్రాతిపదికన తొలగించేందుకు సిబ్బంది శనివారం తెల్లవారు జాము నుంచి పనులు చేపట్టారు. జీహెచ్ఎంసీ పద్నాల్గవ సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ పి.శ్రీకాంత్రెడ్డి పరిశీలించారు. ఉదయం వరకు వాహనాలు రహదారులపై సజావుగా సాగేలా చర్యలు తీసుకునేందుకు వారు సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు.
స్వీపింగ్ యంత్రాల ద్వారా క్లీనింగ్..
వినాయక నిమజ్జనం ప్రధాన రహదారిలో చెత్తను ఎత్తివేయడంతో పాటు శుభ్రంగా ఉండేందుకు గాను స్వీపింగ్ యంత్రాల ద్వారా శుభ్రం చేశారు. వర్షంతో రోడ్డుకు అతుక్కు పోయిన పుష్పాలు, ఫలహారాల వ్యర్థాలు వాటర్ జెట్ మిషన్ల ద్వారా కడుగుతూ వ్యర్థాలు లేకుండా చేశారు. శానిటేషన్ సిబ్బంది రోడ్లన్నింటినీ శుభ్రంగా ఊడ్చి చెత్తను ఎత్తి వేశారు. దీంతో నిమజ్జన మార్గంలోని అనేక ప్రాంతాలు శుభ్రంగా కనిపించాయి. మొత్తంమీద నిమజ్జనం సందర్భంగా రహదారులను సకాలంలో ఊడ్చిన శానిటేషన్ సిబ్బంది శభాష్ అనిపించుకున్నారు.
సకాలంలో శుభ్రం చేయించాం
వినాయక నిమజ్జన ప్రధాన మార్గంలో పేరుకు పోయిన చెత్తను తొలగించడంతో పాటు రోడ్లను సకాలంలో ఊడ్పించి శుభ్రం చేయించాం. వినాయక ప్రతిమలు అన్ని నిమజ్జనానికి వెళ్లిన వెంటనే సిబ్బంది రోడ్లను ఊడ్చే పనులను చేపట్టారు. వారు శ్రమించి రోడ్లపై వాహనాల రాక పోకలు సజావుగా సాగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
– డాక్టర్ పి. శ్రీకాంత్రెడ్డి ,జీహెచ్ఎంసీ పద్నాల్గవ సర్కిల్ ఏఎంఓహెచ్