మాదాపూర్, సెప్టెంబర్ 3: మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం అడ్మిన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కె.రాజేంద్ర గతంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. దీంతో అడిషనల్ ప్రత్యేక జడ్జి నేడు తుది తీర్పు వెల్లడించారు. ఇందులో భాగంగా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో 2013లో ఇర్షాద్ ఖురేషి అనే వ్యక్తికి సంబంధించిన మోటారు వాహనమును ఎస్సైగా పనిచేస్తున్న కె.రాజేంద్ర పట్టుకున్నాడు.
దీంతో వాహన యజమాని ఇర్షాద్ ఖురేషి రాజేంద్ర వద్దకు వచ్చి మోటార్ వాహనమును తిరిగి ఇవ్వమని అడుగగా, ఎస్సై రాజేంద్ర అతని వద్ద రూ.10 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించిన మోటారు యాజమాని అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కోర్టు విచారణకు ఆదేశించడంతో కేసు శనివారం తుది తీర్పునకు రాగా ఎస్సై రాజేంద్రకు 1988 యాక్టు చట్టం కింద 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల పెనాల్టీనీ విధించారు. సదరు వ్యక్తి జరిమానా మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే మరో 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించేలా కోర్టు తీర్పును ఇచ్చింది.