శామీర్పేట, సెప్టెంబర్ 2 : రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 10లక్షల పింఛన్లతో మొత్తం 46లక్షల పింఛన్లను ప్రభు త్వం పంపిణీ చేస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఆసరా పింఛన్ కింద అందజేస్తున్న రూ.2016, రూ.3016తో వృద్ధులు, వికలాంగులు, వృత్తిదారులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని అన్నారు. ఇందుకోసం ప్రతి నెలా కోట్లాది రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. శామీర్పేట, మూడుచింతపల్లి, తూంకుంట మున్సిపాలిటీలో ఆసరా పింఛన్లకు ఎంపికైన లబ్ధిదారులకు శుక్రవారం కార్డులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఆసరా పింఛన్తో నిర్లక్ష్యానికి గురయ్యే వృద్ధులకు సీఎం కేసీఆర్ ఆత్మగౌరవాన్ని కల్పించారన్నారు. ఆసరా పింఛన్తో లబ్ధి పొందుతున్న వృద్ధులు, వికలాంగులకు పెద్ద కొడుకులా, పెద్దన్నలా, మేనమామలా భావిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్లు అవాక్కులు, చెవాక్కులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలు చేస్తున్నాయా?అని ప్రశ్నించారు.
అసలు కేసీఆర్లా ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబీమా, రైతుబంధు లాంటి పథకాలను అమలు చేసే దమ్ముందా అని ఆయన సవాల్ విసిరారు. ఆ పార్టీలతో ఓరిగేదేమి లేదన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణను కళ్లబొల్లి మాటలు చెప్పే బీజేపీ, కాంగ్రెస్ల చేతిలో పెడితే ఆగం అవుతామని అన్నారు. తెలంగాణ రాకముందు పరిస్థితి ఏమిటి, కేసీఆర్ పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత పరిస్థితులపై బేరీజు వేసుకోవాలన్నారు. రైతాంగానికి సాగు నీరు, ఇంటింటికి తాగునీరు, 24 గంటల కరెంట్, భారీ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం తదితర ఎన్నో మార్పులు కేసీఆర్ సారధ్యంలో సాధ్యపడ్డాయన్నారు. భవిష్యత్లో కొత్తగా ఏర్పడిన తెలంగాణే దేశానికి మోడల్గా మారనుందన్నారు. వ్యవసాయం, ప్రజల కష్టనష్టాలపై సీఎం కేసీఆర్కు పూర్తి అవగాహన ఉందన్నారు.
రాష్ర్టాన్నే కాదు దేశం స్థితి గతులను మార్చే శక్తియుక్తులు కేసీఆర్ ఉన్నాయన్నారు. శామీర్పేట, మూడుచింతపల్లి మండలాలు, తూంకుంట మున్సిపాలిటీలో మొత్తం 2130 మందికి కొత్తగా పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, తూంకుంట మున్సిపాలిటీ చైర్మన్ కారంగుల రాజేశ్వర్రావు, వైస్ చైర్మన్ వాణివీరారెడ్డి, ఎంపీసీలు ఎల్లూబయి, హారిక, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, జడ్పీటీసీ అనిత, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, ఏఎంసీ వైఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, కమిషనర్ జేతురాం, ఎంపీడీవోలు వాణి, రవినాయక్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్, మల్లేశ్ గౌడ్, నోముల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.