కేపీహెచ్బీ కాలనీ, సెప్టెంబర్ 2 : వినాయక నవరాత్రోత్సవాల్లో కీలక ఘట్టమైన విగ్రహాల నిమజ్జనానికి జీహెచ్ఎంసీ యంత్రాంగం ఏర్పాట్లు సిద్ధం చేశారు. నవరాత్రోత్సవాల్లో మూడో రోజు నుంచే విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భక్తులు చెరువుల వద్దకు చేరుకోవడంతో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తైనట్లు అధికారులు తెలిపారు. కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో ప్రధాన చెరువులతో పాటు వినాయక నిమజ్జన కొలనుల వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ యేడాది మూడు ప్రాంతాల్లో పోర్టబుల్ (రబ్బర్) వాటర్ ట్యాంకర్లతో పాటు రెండుచోట్ల ఎర్త్పిక్స్ను ఏర్పాటు చేస్తున్నారు. చిన్న విగ్రహాల నుంచి భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేలా క్రేన్లను సిద్ధం చేయడంతో పాటు చెరువులు, కొలనులలో వేసిన విగ్రహాల వ్యర్థాలు, పూజా వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా ఏర్పాట్లు చేశారు. చెరువు పరిసరాలలో విద్యుత్ దీపాల ఏర్పాటు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు పోలీస్, ట్రాఫిక్, జలమండలి, ఇరిగేషన్, విద్యుత్ శాఖాధికారుల సమన్వయానికి చెరువు గట్లపై ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు.
8 చెరువుల్లో.. 15 భారీ క్రేన్లు..
కూకట్పల్లి జోన్ పరిధిలో మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్ సర్కిళ్లు ఉండడగా వినాయక నిమజ్జన వేడుకల కోసం 8 ప్రధాన చెరువుల వద్ద జీహెచ్ఎంసీ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మూసాపేట సర్కిల్లోని రంగధాముని (ఐడీఎల్) చెరువు, సున్నం చెరువు, కూకట్పల్లి సర్కిల్లోని హస్మత్పేట బోయిన్ చెరువు, అంబీర్ చెరువు, కుత్బుల్లాపూర్ సర్కిల్లోని వెన్నెలగడ్డ చెరువు, గాజులరామారం సర్కిల్లోని పరికి చెరువు, లింగం చెరువు, అల్వాల్ సర్కిల్లోని కొత్త చెరువుల వద్ద ఏర్పాట్లు చేశారు. జోన్ పరిధిలో 30 నుంచి 70 టన్నుల విగ్రహాలను నిమజ్జనం చేసేలా 15 భారీ క్రేన్లు, 15 టన్నుల విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు 1 క్రేన్, 7 మొబైల్ కేన్లు, 8 ఇటాచిలు, 8 జేసీబీలు, 31 లిఫ్టర్లను ఏర్పాటు చేశారు. ఈ భారీ క్రేన్ల సహాయంతో పెద్ద విగ్రహాలను చెరువుల్లో, కొలనుల్లో నిమజ్జనం చేస్తారు.
కొలనులు.. రబ్బర్ ట్యాంక్లు..
కూకట్పల్లి జోన్లో 7చోట్ల వినాయక నిమజ్జన కొలనులు ఉన్నాయి. మూసాపేట సర్కిల్ బాలాజీనగర్లోని ముళ్లకత్వ చెరువు, రంగధాముని (ఐడీఎల్) చెరువు, కూకట్పల్లి సర్కిల్లోని హస్మత్పేట బోయిన్ చెరువు, ఆల్విన్కాలనీ పరికి చెరువు, కుత్బుల్లాపూర్ సర్కిల్లోని వెన్నెలగడ్డ చెరువు, గాజులరామారం సర్కిల్లోని లింగం చెరువు, అల్వాల్ సర్కిల్లోని కొత్త చెరువులలో ప్రత్యేకంగా నిర్మించిన కొలనుల్లో సాధారణ విగ్రహాలను నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ యేడాది కొత్తగా మూడుచోట్ల ఫోర్టబుల్ (రబ్బరు) ట్యాంక్లను అందుబాటులోకి తెచ్చారు. కూకట్పల్లి సర్కిల్లోని చిత్తారమ్మ టెంపుల్ వద్ద, గాజులరామారం సర్కిల్లోని ఐడీఎల్ ఓపెన్ ప్లేస్, అల్వాల్ సర్కిల్లోని కౌకూర్ పార్కులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ట్యాంక్లలో మూడుఫీట్ల లోపు విగ్రహాలను నిమజ్జనం చేయొచ్చు. అలాగే గాజులరామారం ప్లే గ్రౌండ్లో, కుత్బుల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ ప్లే గ్రౌండ్లో ఎర్త్పిక్ను ఏర్పాటు చేశారు. ఈ గుంతలలో నీరునింపి చిన్న విగ్రహాలను నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు పూర్తి చేశారు.
పోర్టబుల్ పాండ్ను పరిశీలించిన జడ్సీ
వివేకానందనగర్ డివిజన్ చిత్తారమ్మ దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోర్టబుల్ పాండ్ను కూకట్పల్లి జడ్సీ మమత, డీసీ రవీందర్, కార్పొరేటర్ మాధవరం రోజాదేవిలు శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ చిన్నారెడ్డి, మాజీ కార్పొరేటర్ రంగారావు పాల్గొన్నారు.
– మియాపూర్, సెప్టెంబర్ 2
పకడ్బందీగా ఏర్పాట్లు..
వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా నిమజ్జనాలు జరిగే 8 చెరువులు.. ప్రత్యేకంగా నిర్మించిన 7 కొలనులతో పాటు మూడుచోట్ల ఫోర్టబుల్ (రబ్బర్) ట్యాంక్లు, రెండుచోట్ల ఎర్త్పిక్లను నిర్మించాం. చిన్న విగ్రహాలను నిమజ్జనం చేయడానికి కాలనీలకు అందుబాటులో ఫోర్టబుల్ ట్యాంక్, ఎర్త్పిక్లు ఉపయోగపడతాయి. చెరువుల వద్ద భారీ క్రేన్లు, విద్యుత్ దీపాలు, బారీకేడ్లను ఏర్పాటు చేశాం. పూజా వ్యర్థాలు చెరువులో, కొలనులో వేయకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. నిమజ్జన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా జాగ్రత్తలు తీసుకున్నాం.
– వి.మమత, జడ్సీ, కూకట్పల్లి జోన్