మారేడ్పల్లి, ఆగస్టు 19: టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయాలన్ని ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. అదేవిధంగా ఆలయాల్లో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్లోని గణపతి ఆలయంలో శుక్రవారం రూ.18 లక్షల వ్యయంతో చేపట్టిన అన్నదాన భవనం, లిప్ట్, అర్చక భవనం నిర్మాణ పనులకు మంత్రి తలసాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…సికింద్రాబాద్ గణపతి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినదని, ప్రతి రోజూ వేల మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం వస్తుంటారని తెలిపారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రులకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 6 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక, ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్, చైర్మన్ జయరాజ్, సభ్యులు సాయి ప్రకాశ్, శ్రీశైలం, హన్మంతరావు, తదితరులు పాల్గొన్నారు.