సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): క్రీడాకారులలో వజ్రోత్సవ స్ఫూర్తిని పెంపొందించేందుకు ఫ్రీడమ్ కప్ స్పోర్ట్స్ ముఖ్య ఉద్దేశమని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 18వరకు నిర్వహించిన ఫ్రీడమ్ కప్ స్పోర్ట్స్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో భాగంగా గురువారం విక్టరీ ప్లే గ్రౌండ్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నగరంలోని 11 క్రీడామైదానంలో 13 క్రీడలను నిర్వహించగా, 386 టీమ్లు పాల్గొన్నాయని పేర్కొన్నారు. అందులో 310 పురుషుల టీములు, 76 మహిళా విభాగం టీమ్లు ఉన్నాయని తెలిపారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా క్రీడా మైదానాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 86 కోట్ల 5 లక్షలను మంజూరు చేశామని తెలిపారు. విక్టరీ ప్లే గ్రౌండ్లో నిర్వహించిన వాలీబాల్, బాసెట్ బాల్ పోటీలలో గెలుపొందిన వారికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జ్ఞాపిక, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సమావేశంలో గన్ ఫౌండ్రి కార్పొరేటర్ విశ్వసురేఖ, అడిషనల్ కమిషనర్ స్పోర్ట్స్ విజయలక్ష్మి, జోనల్ కమిషనర్ రవికిరణ్, స్పోర్ట్స్ డైరెక్టర్ డీ.ఎస్.భాషా, డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్, ఖైరతాబాద్ జోన్ గేమ్స్ ఇన్ స్పెక్టర్ మాధవి, వాలీబాల్ కోచ్లు వినోద్, ముస్తఫా, అరవింద్, బాసెట్ బాల్ కోచ్ అమృత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్లో..
స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా కలెక్టర్ హరీశ్ ఆదేశాల మేరకు యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ మైదానంలో గురువారం ఉద్యోగులకు క్రీడలు నిర్వహించారు. అనంతరం వాలీబాల్, కబడ్డీ, త్రోబాల్, టెన్నికాయిట్ క్రీడల్లో గెలుపొందిన ఉద్యోగులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, శ్యామ్సన్, డీఆర్వో లింగ్యానాయక్, డీఈవో విజయకుమారి, యువజన, క్రీడలశాఖ అధికారి బల రామారావు తదితరులు పాల్గొన్నారు.
దేశం గర్వించేలా.. స్వతంత్ర వజ్రోత్సవాలు
దేశం గర్వించేలా రాష్ట్ర వ్యాప్తంగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వజ్రోత్సవాల్లో భాగంగా అంబర్పేట డివిజన్ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పలు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు గురువారం ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతశోభన్రెడ్డి తదితరులతో కలసి మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయ్కుమార్ గౌడ్, బి.పద్మావెంకట్రెడ్డి, ఉమారమేశ్యాదవ్, టీఆర్ఎస్ నాయకులు సిద్ధార్థ్ముదిరాజ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో..
దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా రాచకొండ పోలీసులు, జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఫ్రీడమ్ కప్ విజేతలకు మంత్రి సబితారెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్రీడమ్ కప్లో విజేతలకు శుభాకాంక్షలు తెలిపి, ఓటమి చెందిన వారు నిరుత్సాహపడకుండా మరోసారి గెలుపునకు ప్రయత్నించాలని సూచించారు. మహాత్మాగాంధీ జీవిత చరిత్ర భవిష్యత్తరాలకు తెలిపే విధంగా విద్యార్థులకు గాంధీజీ సినిమాను ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్, ఎమ్మెల్సీలు యెగ్గే మల్లేశం, దయానంద్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, రాష్ట్ర ఒలింపిక్ కార్యదర్శి జగదీశ్యాదవ్, క్రీడాకారులు పాల్గొన్నారు.