అబిడ్స్, ఆగస్టు 18: దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఫెస్టివల్ మేళాను నిర్వహిస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గం గురువారం పేర్కొన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 23వ తేదీ వరకు ఫెస్టివల్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో గతేడాది నిర్వహించిన మేళాకు విశేష స్పందన లభించడంతో ఈ ఏడాది కూడా నిర్వహించాలని సొసైటీ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రతి యేడాది ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ నిరంతరం కొనసాగుతున్న విషయం తెలిసిందేనని వారు పేర్కొన్నారు. ప్రజల నుంచి మైదానానికి వచ్చే సందర్శకుల ప్రయోజనార్థం పండుగలకు షాపింగ్ చేసుకునేందుకు వీలుగా ఫెస్టివల్ మేళాను నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు.