తెలుగుయూనివర్సిటీ, ఆగస్టు 17: తెలంగాణ ప్రభు త్వం కళాకారులకు అండగా ఉంటున్నదని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం అన్నారు. సింగిడి సాంస్కృతిక సంస్థ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తాధ్వర్యంలో వందే కృష్ణం.. పేరుతో నాంపల్లి సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయ ప్రాంగణంలోని ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన శ్రీకృష్ణుడిపై ప్రదర్శనలు ఆద్యంతం ఆహూతుల ప్రశంసలందుకున్నాయి. ప్రముఖ నృత్య కళాకారులు రాహుల్ సిన్హా బృందం భరతనాట్య శైలిలో, సుదీప్ కుమార్ ఘెష్ బృందం మణిపురి నృత్య రీతులు నాట్యప్రియుల కరతాళధ్వనులందుకున్నాయి.
సందీప్ బృందం పేరిణి నృత్య ప్రదర్శన ఆహూతులను విశేషంగా అలరించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంద జగన్నాథం మాట్లాడుతూ.. తెలంగాణ కళలను ప్రపంచానికి చాటేలా కళాకారులచే విస్తృతంగా కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నదన్నారు. కార్యక్రమంలో సరోజినీ నాయుడు వనిత కళాశాల ప్రిన్సిపాల్ శోభ, సెక్రటరీ వినయ్కుమార్, తెలుగువర్సిటీ పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య టి.గౌరీశంకర్, సింగిడి సంస్థ వ్యవస్థాపకులు, భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దక్షిణ మధ్య క్షేత్రియ సాంస్కృతిక కేంద్రం సభ్యులు విశ్వకర్మ డి.ఆర్.కె. సుజాత దీక్షిత్ పాల్గొని కళాకారులను సత్కరించారు.