కన్జ్యూమర్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అనంత్ శర్మ
ఖైరతాబాద్, ఆగస్టు 17 : వినియోగదారులు తమ హక్కులను విధిగా తెలుసుకోవాలని కన్జ్యూమర్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అనంత్ శర్మ సూచించారు. కన్జ్యూమర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సౌత్ ట్యాక్స్ పేయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కన్జ్యూమర్ రీసెర్చ్ అండ్ టెస్టింగ్ సెంటర్ సంయుక్తాధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఏర్పాటు చేశారని, వినియోగదారులు తమ సమస్యలను దృష్టికి తీసుకువస్తే వారు వెంటనే ఆయా జిల్లాల కలెక్టర్ల చేత విచారణ జరిపించి చర్యలు తీసుకుంటారని తెలిపారు.
లీగల్ మెట్రాలజీ అధికారి శ్రీవల్లి మాట్లాడుతూ.. ఒక వస్తువు కొనుగోలు చేసినప్పుడు బరువు, కొలతలు, ప్యాకేజీలను ప్రమాణికంగా తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. డిప్యూటీ కంట్రోలర్ డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం బజార్లో కొనుగోలుచేసి తాగే నీరు అసలు మినరల్ వాటర్ కానేకాదన్నారు. వాటిని కేవలం డ్రింకింగ్ వాటర్గానే పరిగణించాలన్నారు. మినరల్స్ ఉన్న నీటి కనీస ధర వంద నుంచి రూ.150కి పైగా ఉంటుందని చెప్పారు. కల్తీ వస్తువుల తయారీదారులపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ర్టాల వినియోగదారుల సమన్వయ సమితి ప్రతినిధులు పల్లెపాడు దామోదర్, సుదర్శన్, విక్రాంత్ సనాయి తదితరులు పాల్గొన్నారు.