సుల్తాన్బజార్, ఆగస్టు 17: వక్ఫ్బోర్డులో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి రాజేందర్, ప్రతాప్ ఆదేశాల మేరకు నాంపల్లి హజ్ భవన్లోని రాష్ట్ర వక్ఫ్బోర్డు కార్యాలయం ముందు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మసిఉల్లాఖాన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతకొంత కాలంగా వక్ఫ్బోర్డులో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న సహాయ కార్యదర్శి ఫారూఖీని వెంటనే విధుల నుంచి తొలగించాలన్నారు.
ఉద్యోగుల సమస్యలను మూడు రోజుల్లో పరిష్కరించాలని, లేనిపక్షంలో తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. సానుకూలంగా స్పందించిన చైర్మన్ మసిఉల్లాఖాన్ మాట్లాడుతూ.. త్వరలోనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ కార్యదర్శి ఎస్.విక్రమ్ కుమా ర్, కోశాధికారి జె.బాలరాజ్, ఉపాధ్యక్షులు కేఆర్. రాజ్కుమార్, ఉమర్ఖాన్, కురాడి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యులు సయ్యద్ ఇబ్రహీం, సయ్యద్ జలీల్ అహ్మద్, సయ్యద్ హసన్ హుస్సేన్ తిర్మీజి, మహమ్మద్ అబ్దుల్ జబ్బార్, అబ్దుల్ ఖాదర్, టీ ఎన్జీవో జిల్లాశాఖ సంయుక్త కార్యదర్శి నరేశ్ కుమార్, ప్రచార కార్యదర్శి ఖాలేద్ అహ్మద్, సభ్యులు హరిబాబు, వైదిక్ శస్త్ర, బి.శంకర్, మాజీ కార్యదర్శి ప్రభాకర్, ఏ పీఆర్వో మహ్మద్ వహీద్ తదితరులు పాల్గొన్నారు.