రవీంద్రభారతి, ఆగస్టు 17: దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం రవీంద్రభారతిలో గురువు రామాచారి సంగీత దర్శకత్వంలో ‘పుణ్యభూమి నాదేశం నమో నమామి.. లలిత, సినీ గీతాలాపన’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. దేశభక్తి గీతాలపై రవీంద్రభారతిలో ప్రదర్శన ఇవ్వడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కవులను, కళాకారులను గౌరవిస్తూ, చేయూతనిస్తున్నారని కొనియాడారు. గురువు రామాచారి సంగీత దర్శకత్వంలో లిటిల్ మ్యూజిక్ అకాడమీ బాలబాలికలు స్వతంత్ర భారత వజ్రోత్సవాల ద్వి సప్తాహ గీతాలను ఆలపించారు. మంత్రి శ్రీనివాస్గౌడ్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ వేదికపై చిన్నారులతో స్వరం కలిపారు. దేశభక్తి గీతాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.