సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ నెల 18 నుంచి అఫిలియేషన్లకు సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ(ఎఫ్ఎఫ్సీ) తనిఖీలు ప్రారంభం కాబోతున్నాయని జేఎన్టీయూ హైదరాబాద్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. ఈ నెల 21 నుంచి ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈలోపే అఫిలియేషన్ పొందిన కాలేజీలు, కోర్సులు, సీట్ల వివరాలు ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ముఖ్యంగా సివిల్, మెకానికల్, ఈఈఈ వంటి విభాగాల్లో సీట్లు తగ్గించుకుంటున్నారని, దాని వల్ల ఆయా కోర్సులకు టీచింగ్ ఫ్యాకల్టీ, వారికి ఇచ్చే జీతాలు, వారి క్వాలిఫికేషన్ వంటి వివరాలు తెలుసుకున్నామని, వెంటనే వాటికి అనుమతి ఇచ్చే ప్రక్రియ ప్రారంభించామన్నారు.
సీఎస్ఈ సీట్లకు తర్వాత అఫిలియేషన్లు..
ఇంజినీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) విభాగానికే ఎనలేని డిమాండ్ ఉండటంతో వాటిలో కూడా భారీగా సీట్ల సంఖ్య పెరుగుతుందన్నారు. పెరుగుతున్న సీట్ల ప్రకారం ఆయా కాలేజీల్లో డిపార్టుమెంట్ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రిజిస్ట్రార్ తెలిపారు. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం, సీట్ల సంఖ్యను బట్టి ఉండాల్సిన ప్రొఫెసర్లు, టీచింగ్ ఫ్యాకల్టీ, వారికుండే అర్హతలు, ధ్రువీకరణ పత్రాలు వాస్తవమైనవా? కాదా? వారికి యూజీసీ స్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తున్నారా? ఆ జీతాలు బ్యాంకు ద్వారా చెల్లిస్తున్నారా? నగదు రూపంలో చెల్లిస్తున్నారా వంటి వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత.. అన్ని సక్రమంగా ఉంటేనే కాలేజీలు, కోర్సులు, సీట్లకు 2022-23 విద్యా సంవత్సరానికి సీట్లకు అనుమతి ఇచ్చి, అడ్మిషన్ కౌన్సెలింగ్ అధికారులకు పంపిస్తామన్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో నాణ్యమైన విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం కోసమే ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు.