మేడ్చల్, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్ను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రారంభించనున్నారు. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.56.20 కోట్ల నిధులతో కలెక్టరేట్ భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2.55 గంటలకు శామీర్పేట మండలం అంతాయిపల్లిలోని సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించి 3.55 గంటలకు స్థానిక ఐడీవోసీ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా సభా వేదిక ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వేదికతో పాటు వాహనాల పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి రాకకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి మల్లారెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. నూతన కలెక్టరేట్ను జిల్లా ఎమ్మెల్యేలైన మైనంపల్లి హన్మంతరావు, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, జిల్లా కలెక్టర్ హరీశ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి మంత్రి మల్లారెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. వర్షం కురిసినప్పటికి ఇబ్బందులు లేకుండా చూడాల్సిందింగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి మల్లారెడ్డి వివరించారు.
పార్కింగ్ స్థలం మొదలుకొని సభా ప్రాంగణం, వేదికలను పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాక నుంచి సభ ముగింపు వరకు ముందస్తుగానే కార్యాచరణ ప్రకారం సంబంధిత జిల్లా అధికారులకు ఆయా పనులను అప్పగించామన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సభను విజయవంతం చేస్తామన్నారు. సమీకృత కలెక్టరేట్ ప్రారంభానికి సర్వం సిద్ధం అయినట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ వెల్లడించారు. జిల్లా అధికారులతో కలెక్టర్ హరీశ్ సమీక్షా సమావేశం నిర్వహించి ఏర్పాట్లలో లోటుపాట్లను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.