జూబ్లీహిల్స్, ఆగస్టు10: స్వతంత్ర వజ్రోత్సవాలను అత్యంత ఘనంగా జరుపుకోవాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. ఈనెల 22 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాల రెపరెపలతో అంబరాన్నంటే వజ్రోత్సవ సంబురాలు నిర్వహించి స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా బుధవారం రహ్మత్నగర్ డివిజన్ ఎన్ఎస్బి నగర్ ప్లే గ్రౌండ్లో కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల వర్షాల కారణంగా నిలిచిపోయిన జూబ్లీహిల్స్ నాకౌట్ క్రికెట్ టోర్నీని ఈ నెల 17 నుంచి పునఃప్రారంభించనున్నట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాలలో భాగంగా చేపట్టి.. తుది దశకు చేరుకున్న ఈ పోటీల విజేతలకు నగదు బహుమతులతో పాటు ఫ్రీడం కప్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 20న నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల మహిళలకు ఎన్ఎస్బి నగర్ గ్రౌండ్లో ముగ్గుల పోటీలు నిర్వహించి పాల్గొన్న వారందరికీ బహుమతులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
త్యాగమూర్తులు మరువరాదు..
వెంగళరావునగర్, ఆగస్టు 10: ఎంతో మంది ప్రాణత్యాగాలతో మనదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని..ఆ త్యాగమూర్తులను మరువరాదని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీనగర్ కాలనీ డివిజన్లో జాతీయ పతాకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 22వ తేది వరకు వజ్రోత్సవాలు జరుగనున్నాయని పేర్కొన్నారు. 75 ఏళ్ల వజ్రోత్సవాల్లో భాగంగా 75 మొక్కలను నాటడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సంగీత శ్రీనివాసయాదవ్, శేషసాయి, వేదప్రకాష్, సుగుణ, ప్రసన్నరెడ్డి, జి.కె. రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు అప్పుఖాన్, తన్నూఖాన్, మధు, మారుతి, శిరిష, రాణి, కవిత తదితరులు పాల్గొన్నారు.