మేడ్చల్, ఆగస్టు 10(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్ అంతాయిపల్లిలో రూ. 50 కోట్లతో 30 ఎకరాల్లో నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్ ప్రారంభానికి సిద్ధమైంది. 17న సీఎం కేసీఆర్ ఈ భవనాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై బుధవారం జిల్లా కలెక్టర్ హరీశ్ అధ్యక్షతన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మిగిలిపోయిన పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, డీఆర్వో లింగ్యానాయక్, జడ్పీ సీఈవో దేవసహాయం, జిల్లా అధికారులు పద్మజారాణి, రమణామూర్తి తదితరులు పాల్గొన్నారు. కాగా, కలెక్టరేట్ భవనాన్ని కలెక్టర్ హరీశ్ అధికారులతో కలిసి పరిశీలించారు.