పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) విగ్రహాల బదులు సహజరంగులు, మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాల ఏర్పాటుకు ఏటా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా లక్ష మట్టి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయనుంది. ఇందుకు సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారుల సాయంతో సహజరంగులు కొనుగోలు చేసి కుమ్మరి వృత్తిదారులకు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది. 8 అంగుళాల ఎత్తు ఉండే ఈ మట్టి విగ్రహాలను గ్రేటర్లో 60 వేలు, జిల్లాల్లో 30 వేలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 10 వేల చొప్పున అందజేయనున్నారు. విగ్రహాల తయారీ, పంపిణీ కోసం పీసీబీ రూ.55 లక్షలు వెచ్చిస్తోంది.
సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను మాత్రమే పూజించేలా.. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి లక్ష మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నది. మట్టి గణపతులే పూజిద్దాం.. అంటూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకుగాను తమ వంతు బాధ్యతగా ఉచితంగా 8 అంగుళాల ఎత్తుతో కూడిన మట్టి విగ్రహాలను తయారు చేయించి, ఉచితంగా అందించాలని పీసీబీ నిర్ణయించింది. రసాయన రహిత గణపతి విగ్రహాల తయారీపై అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి మట్టితో విగ్రహాలను తయారు చేయడంతో పాటు వాటికి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికాలు ఎంపిక చేసిన సహజ రంగులను వినియోగించేలా చర్యలు చేపట్టారు. కుమ్మర వృత్తి దారులకు మట్టి విగ్రహాల తయారీని అప్పగించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 60వేలు
ప్రతియేటా నిర్వహించే వినాయక చవితి ఉత్సవాల్లో పాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాలు కాకుండా పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను నగర ప్రజలకు ఉచితంగానే పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది జీహెచ్ఎంసీ పరిధిలోనే 60వేల మట్టి విగ్రహాలను జోన్లు, సర్కిల్ కార్యాలయాల వారీగా ఆయా ప్రాంతాల్లో తయారు చేయించి పంపిణీ చేసే బాధ్యతలను జీహెచ్ఎంసీకి అప్పగించారు. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో వెయ్యి విగ్రహాల చొప్పున పంపిణీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. మరో 10వేల విగ్రహాలు పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.55 లక్షలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.