ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 10 : తెలంగాణ రాష్ట్ర వాస్తవ చరిత్ర, సంస్కృతిని వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని పలువురు వక్తలు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా మన ప్రత్యేకత, అస్థిత్వానికి సంబంధించిన ప్రశ్నలు ఉద్యమకాలంలో తలెత్తినవని గుర్తు చేశారు. స్వీయ దృక్కోణంలో మన చరిత్రను మనం నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ (సీటీఎస్) ఆధ్వర్యంలో ‘రైటింగ్ కాంప్రెహెన్సివ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ’ అనే అంశంపై రెండు రోజుల వర్క్షాప్ నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి సహకారంతో బుధవారం నిర్వహించిన ఈ వర్క్షాప్ ప్రారంభోత్సవానికి సీటీఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ జాడి ముసలయ్య అధ్యక్షత వహించగా, సీటీఎస్ అనుబంధ ప్రొఫెసర్ చెన్న బసవయ్య, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రీసర్చ్ సెంటర్ అనుబంధ ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, ఢిల్లీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఐ.తిరుమలి, ప్రముఖ జర్నలిస్టు టంకశాల అశోక్, చరిత్రకారుడు కెప్టెన్ ఎల్.పాండురంగారెడ్డి, డాక్టర్ వివేక్, సంగిశెట్టి శ్రీనివాస్, ప్రొఫెసర్ శ్రీనివాస్, డాక్టర్ అరుణ పరీటి, డాక్టర్ అంజయ్య, డాక్టర్ కవిత తదితరులు హాజరై ప్రసంగించారు.
రాష్ట్ర సాధనకు బలమైన చారిత్రక పునాదులు
తెలంగాణ రాష్ట్ర సాధనకు నిర్ధిష్టమైన భావన, అస్థిత్వాలకు బలమైన చారిత్రక పునాదులు ఉన్నాయని వక్తలు వివరించారు. నూతన రాష్ట్ర ఏర్పాటు సెంటిమెంట్ మాత్రమే కాదనే విషయాన్ని చారిత్రక ఆధారాలతో సహా నిరూపించడం తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణంలో కీలక అంశమని అభిప్రాయపడ్డారు.
చరిత్రను నమోదు చేయాల్సిన అవసరం ఉంది
మీర్ ఉస్మాన్అలీ ఖాన్ నిజాం కాలంలో దక్కన్ ప్రాంత చరిత్ర, సంస్కృతిని స్వీయ దృక్పథంతో, 1940 దశకంలో ఆనాటి ప్రముఖ చరిత్రకారులైన షేర్వాణి, యాజ్దానీ లాంటి పెద్దలు ప్రామాణిక ఆధారాలతో సమగ్ర చరిత్రను గ్రంథస్తం చేశారని వక్తలు గుర్తు చేశారు. హైదరాబాద్ రాష్ట్రంలో బూర్గుల రామకృష్ణారావు సీఎంగా ఉన్నప్పుడు గోపాల్రావు ఎగ్బోటే, కాశీనాథ్ వైద్య ఆధ్వర్యంలో స్వాతంత్రోద్యమంలో తెలంగాణ పాత్రపై కమిటీ వేసి, సమగ్ర అధ్యయనం చేసి, సంపుటాలుగా ప్రచురించారని పేర్కొన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా చరిత్రను నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం
సదస్సులో నిష్ణాతులతో చర్చలు జరిపి, ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని వక్తలు పేర్కొన్నారు. ప్రభుత్వమే ఈ ప్రాజెక్టుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని కోరారు. చరిత్ర పూర్వయుగం నుంచి ఆధునిక యుగం వరకు తెలంగాణ నాగరికత విశిష్ట లక్షణాలను, ప్రాముఖ్యతను సోదాహరణంగా వివరించాలని చెప్పారు. ఇందుకు రాష్ట్రప్రభుత్వం చరిత్రకారులతో కమిటీని నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధారాలను సేకరించి, తెలంగాణ చరిత్రను పలు సంపుటాల్లో తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రచురించాలని డిమాండ్ చేశారు.
తెలుగు భాషా సమూహం పేరుతో తెలంగాణకు అన్యాయం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాషా సమూహం పేరుతో తెలంగాణ ప్రత్యేకతను వెలికి తీయలేదని వక్తలు చెప్పారు. తెలంగాణ చారిత్రక విశిష్టత, ప్రత్యేకత విస్మరణకు, వక్రీకరణకు గురైందని వాపోయారు. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ వారు ప్రచురించిన గ్రంథాలలో కూడా తెలంగాణ వివక్షకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ఆధ్వర్యంలో సమగ్ర తెలంగాణ చరిత్రను రాసేందుకు నడుం బిగించారని ప్రశంసించారు. ప్రాంతీయ చరిత్రను సూక్ష్మ స్థాయిలో అధ్యయనం చేయాలని అన్నారు.