ముషీరాబాద్, ఆగస్టు 7: పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ 9న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా ప్రభుత్వం దాటవేత ధోరణిని అవలంబిస్తున్నదని మండిపడ్డారు. ఆదివారం విద్యానగర్లోని బీసీ భవన్లో దక్షిణాది రాష్ర్టాలకు చెందిన బీసీ సంఘాల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం బీసీలను చిన్న చూపు చూస్తున్నదని మండిపడ్డారు. కులగణన చేస్తే బీసీలకు న్యాయమైన వాటా ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే కేంద్ర ప్రభుత్వం కుల గణనన చేయడానికి ముందుకురావడం లేదని ఆరోపించారు. బీసీ నేత ప్రధానిగా ఉన్నప్పుడే బీసీలకు న్యాయం జరగకపోతే ఎప్పటికీ న్యాయం జరగదని అన్నారు.
బీసీల రిజర్వేషన్లను 34 నుంచి 50 శాతానికి పెంచడంతోపాటు రాజకీయ, ఉద్యోగ ప్రమోషన్లలో రిజర్వేషన్లు, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు డిమాండ్తో చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఢిల్లీలో 9,10,11 తేదీల్లో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు లాల్ కృష్ణ, రాజ్కుమార్, అనంతయ్య, రామకృష్ణ, ఉదయ్, చంటి, తరుణ్ యాదవ తదితరులు పాల్గొన్నారు.