దుండిగల్, ఆగస్టు 7 : నీటి సంపును శుభ్రం చేస్తూ.. కరెంట్షాక్ తగలడంతో ఇంటి యజమానితో పాటు ఓ బాలుడు మృతిచెందిన సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని మల్లంపేటలో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్గొండ జిల్లా, మాసన్నపల్లెకు చెందిన జానారెడ్డి(30), మహేశ్వరి దంపతులు. వీరికి నాలుగేండ్ల కూతురు ఉంది. దంపతులిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. గత మూడేండ్లుగా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట డ్రీమ్వ్యాలీలో ఇంటిని కొనుగోలు చేసి అందులోనే నివాసముంటున్నారు. ఆదివారం కావడంతో దంపతులిద్దరూ ఇంటివద్దనే ఉన్నారు.
ఈ క్రమంలో మల్లంపేటకు చెందిన భవానీప్రసాద్(11)తో పాటు మరో బాలుడు ఉదయం 11గంటల ప్రాంతంలో జానారెడ్డి ఇంటికి చేరుకొని నీటిసంపును శుభ్రం చేస్తామని తెలిపారు. సంపును శుభ్రం చేసేందుకు భవానీప్రసాద్ లోపలికి దిగగా అతడికి సహకరించేందుకు ఇంటి యజమాని జానారెడ్డి సైతం సంపులోకి దిగాడు. ఈ క్రమంలో సంపులోని పంపునకు విద్యుత్సరఫరా అవుతుండటంతో ఇద్దరూ కరెంట్షాక్కు గురయ్యారు.
ఇది గమనించిన మహేశ్వరి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు విద్యుత్ మొయిన్ను ఆఫ్ చేసి, తీవ్రంగా గాయపడిన జానారెడ్డి, భవానీ ప్రసాద్లను చికిత్స నిమిత్తం బాచుపల్లిలోని ఓ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఇద్దరు మృతిచెందినట్లు నిర్ధారించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.