సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): డాక్టర్ బీఆర్ అంబేదర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ 24వ స్నాతకోత్సవం శనివారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కె.సీతారామరావు అధ్యక్షతన అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ స్నాతకోత్సవానికి హాజరై ప్రసంగించారు. పలు కోర్సుల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలతో పాటు బుక్ ప్రైజ్లను ప్రదానం చేశారు.
కెనడాలోని కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్, ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఆశాసింగ్ కన్వర్ ముఖ్యఅతిథిగా హాజరై స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. కరోనా తర్వాత విద్యావిధానంలో భారీ మార్పులు వచ్చాయని, అందరూ దూర విద్య గురించి ఆలోచించేలా చేశాయన్నారు. కామన్వెల్త్లో 33 సార్వత్రిక విశ్వవిద్యాలయాలు ఉండగా అందులో మనదేశంలోనే 17ఉన్నాయని, రానున్న రోజుల్లో మరిన్ని వచ్చే అవకాశం ఉందన్నారు. ఓపెన్ వర్సిటీల ద్వారా 5మిలియన్ల విద్యార్థులకు విద్యను అందిస్తున్నట్లు వివరించారు. నూతన విద్యా విధానం 2020 పూర్తిస్థాయిలో అమలు అయితే జీఈఆర్ 2035నాటికి దేశంలో 50శాతానికి పెరిగే అవకాశం ఉందని ఆశా కన్వర్ పేరొన్నారు. అంతకుముందు గవర్నర్ తమిళిసై ఆశా కన్వర్కు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు.
స్నాతకోత్సవంలో 2018-21, 2019-21 యూజీ, 2019-21 పీజీ విద్యార్థులు 2018-21 అకడమిక్ ఏడాదికి అర్హత సాధించిన 79,968 మంది ఉత్తీర్ణులైన పట్టాలు అందుకున్నారు. డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ) కోర్సుల్లో 57,717 అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. పీజీ (ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ) కోర్సులు, బీఎల్ఐసీ, ఎమ్మెల్ఐసీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 22,231 అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంఫిల్, పీహెచ్డీలో 20 రీసెర్చ్ సాలర్స్ తమ పరిశోధన అనంతరం డిగ్రీలు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు ఆర్.శైలేశ్రెడ్డి, డాక్టర్ బానోత్లాల్, రిజిస్ట్రార్ డాక్టర్ ఏవీఎన్ రెడ్డి, డైరెక్టర్లు ప్రొ.సుధారాణి, ప్రొ.వడ్డాణం శ్రీనివాస్, ప్రొ.గుంటి రవి, పలు విభాగాల డీన్లు ప్రొ.ఘంటా చక్రపాణి, ప్రొ.షకీలాఖానం, ప్రొ.ఆనంద్పవార్, ప్రొ.పుష్పాచక్రపాణి, ఉద్యోగులు, ఉద్యోగ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
మెడల్స్తో మెరిసిన విద్యార్థులు..
స్నాతకోత్సవంలో మొత్తం 128 బంగారు పతకాలు (డిగ్రీ-43, పీజీలో-85) మహిళలకు 87, పురుషులు 41 బంగారు పతకాలు అందుకున్నారు. డిగ్రీలో, మహిళలు 35, పురుషులు 8 బంగారు పతకాలు పొందారు. పీజీలో, మహిళలు 52, పురుషులు 33 బంగారు పతకాలు పొందారు. అలాగే 12 బుక్ప్రైజ్లు ప్రదానం చేశారు. దేశంలోనే తొలిసారిగా రెగ్యులర్ వర్సిటీలతో సమానంగా ఓడీఎల్లో సీబీసీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టామని, కోర్సు పూర్తి చేసి విద్యార్థులు పట్టాలు సైతం అందుకున్నారని తెలిపారు. మొత్తం 282 మంది ఖైదీలు డిగ్రీ పూర్తి చేసుకున్నారు. వీరిలో చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి 12 మంది ఖైదీలు పట్టాలు అందుకున్నారు. ముగ్గురు ఖైదీలకు గోల్డ్ మెడల్తోపాటు బుక్ ప్రైజ్ లభించింది.