సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): జంట జలాశయాల నుంచి వచ్చే వరద నీరు మూసీ నదిని ముంచెత్తుతున్నది. దీంతో మూసీ వరదలు ఎప్పటికప్పుడు కొత్త అనుభవాలను నేర్పుతున్నాయి. తాజాగా ఈ వర్షాకాలం సీజన్ ప్రారంభం నుంచే మూసీకి వరదలు తీవ్ర స్థాయిలోనే వచ్చాయి. ఐటీ కారిడార్గా ప్రసిద్ధి గాంచిన నార్సింగి, మంచిరేవుల, గండిపేట ప్రాంతాల్లో నిజాం కాలంలో నిర్మించిన లో లెవల్ బ్రిడ్జిలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఐటీ కంపెనీలతో నగరం పడమర దిక్కున శరవేగంగా విస్తరిస్తున్నది. జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్సాగర్ కింద ఉన్న ప్రాంతాల్లో ఐటీ కంపెనీల కార్యాలయాలతో పాటు, నివాస ప్రాంతాలు భారీగా వెలుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో నార్సింగి ఓఆర్ఆర్ చౌరస్తాలో సర్వీసు రోడ్డుకు సమాంతరంగా మరో హైలెవల్ బ్రిడ్జిని నిర్మిస్తే భవిష్యత్తులో ఎంతటి వరద వచ్చినా రాకపోకలకు ఆటంకాలు ఉండవని గుర్తించారు. ఇటీవలే హైదరాబాద్ గ్రోత్ కారిడార్ అధికారులు నార్సింగి ఓఆర్ఆర్ ప్రాంతంలో ప్రత్యక్షంగా పర్యటించి అక్కడి వరద తీవ్రతను పరిశీలించారు. ప్రస్తుతం ఓఆర్ఆర్ మెయిన్ క్యారేజ్ వే (ప్రధాన రహదారి)పై ద్విచక్ర, త్రి చక్ర వాహనాలకు అనుమతి లేదు. దీంతో నార్సింగి వద్ద మూసీ నదిపై మరో హై లెవల్ బ్రిడ్జి నిర్మిస్తే అన్ని రకాల వాహనాల రాకపోకలకు అనుకూలంగా ఉంటుంది.