సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను ఈనెల 8 నుంచి 22వ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో ఫిలిం డెవలప్మెంట్ శాఖ అధికారులు, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తదితరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ వేడుకల్లో ప్రతి ఒకరినీ భాగస్వాములను చేసే విధంగా, ఎంతో ఉత్సాహంగా పాల్గొనేలా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 15వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ఇంటికో జెండాను అందజేయనున్నట్లు చెప్పారు.
563 స్రీన్స్లలో మహత్మాగాంధీ చరిత్ర ప్రదర్శన
విద్యార్థి దశ నుండే దేశభక్తిని పెంపొందించే విధంగా తెలుగు, హిందీ భాషల్లో మహత్మాగాంధీ చరిత్రను తెలియజెప్పే చిత్రాలను రాష్ట్రంలోని 2.77 లక్షల సీట్ల సామర్థ్యంతో ఉన్న 563 స్రీన్స్లలో ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. విద్యార్థులను థియేటర్లకు తీసుకువెళ్లే రవాణా ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేపడుతుందని, అంతేకాకుండా వారికి ఉచితంగా వాటర్ బాటిల్స్, స్నాక్స్ అందించనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించాలని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తాను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, కార్యదర్శులు అనుపమ్ రెడ్డి, దామోదర్ ప్రసాద్, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బసిరెడ్డి, ఎఫ్డీసీ ఈడీ కిశోర్బాబు, యూఎఫ్ఓ, క్యూబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.