సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ఎగువన విరామం లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జంటజలాశయాలు హిమాయత్సాగర్, గండిపేటలకు వరద కొనసాగుతోంది. ఈ సీజన్లో తొలిసారి జూలై 10 తేదీనే గేట్లెత్తగా, బుధవారం వరకు 4.5 టీఎంసీల నీటిని మూసీలోకి వదిలారు. జలాశయాల చరిత్రలో ఇంత నీటిని విడుదల చేయడం ప్రథమమని జలమండలి అధికారులు వెల్లడించారు. వరద ఉధృతి కొనసాగుతుండడంతో రెండు జలాశయాల్లో 10 గేట్లు ఎత్తి 4860 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. కాగా, బుధవారం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం మొగల్గిద్దలో అత్యధికంగా 10.2సెం.మీ, గండిమైసమ్మలో 3.5సెం.మీలు, గాజులరామారంలో 1.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. రాగల 3 రోజులు గ్రేటర్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మేరకు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు.
గ్రేటర్లో భిన్న వాతావరణం నెలకొంటున్నది. పగలంతా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా చల్లబడి వర్షం కురుస్తున్నది. బుధవారం సాయంత్రం 6గంటల వరకు రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం మొగల్గిడ్డలో అత్యధికంగా 10.2సెం.మీల వర్షపాతం, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్ గండిమైసమ్మ ప్రాంతంలో 3.5సెం.మీలు, షాబాద్లో 2.7సెం.మీలు, గాజులరామారంలో 1.1సెం.మీలు, రామచంద్రాపురంలో 1.సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు. ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో రాగల మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు గ్రేటర్కు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీచేశారు.
మూసీలోకి నాలుగు టీఎంసీలు..!!
ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఆగస్టు మొదటి వారం వరకే రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరడం, ఇదే స్థాయిలో దిగువ మూసీలోకి వరద నీటిని విడుదల చేయడం జలమండలి చరిత్రలోనే ఇది ప్రప్రథమమని అధికారులు పేర్కొన్నారు. జూలై 10వ తేదీన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ గేట్లను ఎత్తి దిగువ మూసీలోకి నీటిని వదలడం ప్రారంభించగా, బుధవారం వరకు వరద అంచనా బట్టి ఇన్ఫ్లో ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ సీజన్లో ఇప్పటి వరకు ఉస్మాన్సాగర్లోకి 2.839 టీఎంసీల ఇన్ఫ్లో వస్తే మూసీలోకి 2.664 అవుట్ఫ్లో ఉందని అధికారులు చెప్పారు. హిమాయత్సాగర్లోకి 1.857 టీఎంసీల నీరు వస్తే 1.783 టీఎంసీల నీరు మూసీలోకి చేర్చినట్లు అధికారులు పేర్కొన్నారు. జంట జలాశయాల నుంచి మొత్తం 4.447 టీఎంసీల వరద మూసీలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. కాగా జంట జలాశయాల్లోకి వరద ఉధృతి కొనసాగుతుండగా, బుధవారం ఉస్మాన్సాగర్ నుంచి ఆరు గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి 2328 క్యూసెక్కులు, హిమాయత్సాగర్ నుంచి నాలుగు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 2532 క్యూసెక్కుల నీరు మూసీలోకి చేర్చారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నట్లు జలమండలి అదికారులు పేర్కొన్నారు.