సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జన సాంద్రత అధికంగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆ మూడు జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం వైద్యాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఈ మూడు జిల్లాల కేసులే సింహభాగంగా ఉంటున్నట్లు తెలిపారు. కరోనా, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బూస్టర్ డోస్ పంపిణీని మరింత వేగవంతం చేయాలని, గ్రేటర్లోని అన్ని జూనియర్ కాలేజీలు, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు, యూనివర్సిటీల్లోనూ ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలని డీఎం అండ్ హెచ్ఓలను ఆదేశించారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలని, 100 కంటే ఎక్కు మంది ఉంటే 040-24651119 నంబర్ను సంప్రదిస్తే వారు ఉన్న చోటనే ప్రత్యేక టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారన్నారు.
సీజనల్, కరోనా నియంత్రణ, చికిత్సపై మరింత ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి, రంగారెడ్డి జిల్లా అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే సీజనల్ వ్యాధుల నివారణ కోసం జ్వర సర్వే ప్రారంభించామని, అన్ని పీహెచ్సీలు, సీహెచ్సీలు, యూపీహెచ్సీలతో పాటు బస్తీ దవాఖానల్లో సైతం సీజన్ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. నగరంలో డెంగీ కేసులు నమోదవుతున్న దృష్ట్యా ప్రత్యేక హెల్త్ క్యాంప్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ ఆడియాలజిస్ట్స్
అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్స్ అసోసియేషన్ (టీఏఎస్ఎల్పీఏ) న్యూస్ లెటర్ను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం హరీశ్రావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ ఇమాద్ఖాన్ రుమాన్, డాక్టర్ రాజేంద్రకుమార్ పోరిక, డాక్టర్ సత్యరవ్వ, డాక్టర్ ఎన్ మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.