సికింద్రాబాద్, జులై 15: ఆపదలో ఉన్న ఓ కార్మికునికి చేయందించి, ప్రాణాపాయం నుంచి రక్షించి మానవత్వం చాటుకున్నారు.. మారేడ్పల్లి పోలీసులు. విధి నిర్వహణలో ఉన్న పెట్రోలింగ్ కానిస్టేబుల్, ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయిన స్థితిని గమనించి బెదరకుండా సదరు వ్యక్తికి సీపీఆర్ చేశారు. దీం తో పాటు ఆసుపత్రికి తరలించి ప్రాణాలు నిలిపారు. ఈ ఘటన మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం, మారేడ్పల్లి పోలీస్ స్టేషన్కు చెందిన అబ్దుల్ ఖదీర్ శుక్రవారం సాయంత్రం సుమారు ఆరు గంటల సమయం లో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా, మారేడ్పల్లి ప్రధాన రహదారిలోని మైసమ్మ ఆలయ బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయ ఆర్చ్కి సువేందర్ మాకర్ రాకేశ్(25) డెకరేషన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వి ద్యుత్ షాక్కు గురై ఒక్కసారిగా కిందపడిపోయాడు. దీనిని గమనించిన కానిస్టేబుల్ అబ్దుల్ ఖదీర్ వెంటనే రాకేష్కు సీపీఆర్ చేశాడు. అప్పటి వరకు బిగుసుకుపోయిన రాకేశ్ ఒక్కసారిగా శ్వాస తీసుకున్నాడు. ఊపిరి పీల్చుకున్న రాకేశ్ను ఖదీర్ గాంధీకి పెట్రోలింగ్ కారులోనే వెంటనే తరలించి చికిత్స చేయించారు. రాకేష్కు చికిత్స చేసిన వైద్యులు ఎలాంటి ప్రమాదం లేదని, సీపీఆర్ చేయడంతో వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని తెలిపి డిశ్చార్జ్ చేశారు. త్వరితగతిన స్పందించి ఒకరి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ను ‘ఈరోజు హీరో.. నువ్వే…’ అంటూ నగర పోలీసులు సోషల్ మీ డియాలో ఖదీర్ను అభినందిస్తూ పోస్టులు పెట్టారు.