ముషీరాబాద్, జూలై 14: ఎడతెరపి లేకుండావర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ సర్కిల్-15 టౌన్ప్లానింగ్ అధికారులు శిథిల భవనాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రమాదాలకు తావులేకుండా శిథిల భవనాల్లో నివాసముంటున్న వారిని ఖాళీ చేయిస్తూ, తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ సర్కిల్-15 ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో గత నెలలోనే టౌన్ ప్లానింగ్ అధికారులు శిథిల భవనాలను గుర్తించి హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. వారం రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రమాదకరంగా ఉన్న భవనాలు, గోడల తొలగింపు పనులకు శ్రీకారం చుట్టారు. మూడు రోజులుగా టౌన్ప్లానింగ్ అధికారులు శిథిల భవనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. టౌన్ప్లానింగ్ ఏసీపీ గంగవరపు పావని ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది బస్తీల్లో పర్యటిస్తూ శిథిల భవనాలను గుర్తిస్తున్నారు. అంతేకాకుండా గతంలో నోటీసులు ఇచ్చిన శిథిల భవనాల్లో ఎవరైనా ఉంటున్నారా లేక ఖాళీ చేశారా అని ఆరా తీయడంతోపాటు వర్షాలకు కూలిపోయే పరిస్థితి ఉన్న భవనాలను కూల్చివేస్తున్నారు. గురువారం నియోజకవర్గంలోని అడిక్మెట్, బాగ్లింగంపల్లి, కవాడిగూడలలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లు, ప్రహరీలకు జేసీబీ సహాయంతో కూల్చివేశారు.
ప్రాణనష్టం జరుగకుండా చర్యలు..
ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలకు శిథిల భవనాలు కూలిపోయి ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉండటంతో టౌన్ ప్లానింగ్ అధికారులు ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. గతంలో వర్షాలకు పురాతన భవనాలు కూలి పలువురు మృత్యువాత పడిన నేపథ్యంలో ముప్పు ముంచుకురాగా ముందే మందస్తు చర్యలు చేపడుతున్నారు. ఓ పక్క శిథిల భవనాలను కూల్చుతూనే మరోపక్క పురాతన భవనాల రూపంలో ముప్పు రాకుండా భవన యాజమానులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న 11 శిథిల భవనాలను గుర్తిం చి నోటీసులు జారీ చేశారు. గతంలో నోటీసులు ఇచ్చినా ముందుకారానికి 6 భవనాల యాజమానులకు మరోమారు నోటీసులు ఇచ్చి కూల్చివేతలు చేపడుతున్నారు.
భవనాల యజమానులు సహకరించాలి
ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నందున్న శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇండ్లు, ప్రహరీల యాజమానులు నిర్లక్ష్యం వహించకుండా ముందు జాగ్రత్త చర్య లు, కూల్చివేతలు చేపట్టాలి. నోటీసులు ఇచ్చినా పట్టించుకోకుండా శిథిలావస్థ ఇండ్లలో ఉండి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. ప్రమాదకరంగా ఉన్న భవనాలు, గోడలకు సంబంధించి సమాచారం ఇస్తే కూల్చివేస్తాం.
– గంగవరపు పావని, ఏసీపీ టౌన్ప్లానింగ్ సర్కిల్-15