మెహిదీపట్నం, జూలై 14: తెలంగాణ మాసం ఆషాఢ మాసం బోనాలలో భాగంగా గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం బోనాల జాతర ఐదో పూజ గురువారం ఘనంగా జరిగింది. వర్షం వస్తున్నా లెక్క చేయకుండా భక్తులు జగదాంబిక ఎల్లమ్మ వారికి భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ట్రస్టు చైర్మన్ వావిలాల మహేశ్వర్, ఈవో శ్రీనివాస్ రాజు, పూజారి సర్వేశ్వర్లు గురువారం ఆలయంలో అమ్మవారికి అభిషేకం, అర్చనలు చేశారు. ట్రస్టు సభ్యులు ప్రభాకర్ రాజు, ఉమ, మోహన్దాస్, వినోద్, శ్రీకాంత్లు ఆలయం ఆవరణలో నిర్వహించిన యజ్ఞంలో పాల్గొన్నారు. కార్వాన్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి ఠాకూర్ జీవన్సింగ్, నాయకులు కోడూరి శ్రీధర్ సాగర్, పట్లూరి రఘు, నంతోట పల్లవి, విజయలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా గోల్కొండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, మైత్రి, పీస్ కమిటీ సభ్యులు చర్యలు చేపట్టారు.
హుండీకి రూ.4,97,346ల ఆదాయం
గోల్కొండ బోనాల జాతరలో గురువారం వరకు ఐదు పూజలు పూర్తి అయ్యాయి. జూన్ 30వ తేదీన మొదటి పూజతో గోల్కొండ బోనాలు ప్రారంభం అయ్యాయి. జూలై 10వ తేదీ వరకు జరిగిన నాలుగు పూజలకు కలిపి ఇప్పటికి హుండీ ఆదాయం రూ.4,97,346ల వరకు వచ్చిందని ఆలయ ట్రస్టు చైర్మన్ వావిలాల మహేశ్వర్ తెలిపారు.