కొండాపూర్, జూలై 9 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ విశిష్టతను, చరిత్రను భవిష్యత్తరాలకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘కాకతీయ సప్తాహం’లో భాగంగా మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నాణేల ప్రదర్శన ఏర్పాటు చేశారు. క్రీస్తు పూర్వం నుంచి నిజాం కాలం వరకు ఎన్నో అబ్బురపరిచే 1200 నాణేలను సేకరణకర్త కందుల వెంకటేశ్ అందుబాటులో ఉంచారు.
తొలి నాణేం..
వస్తుమార్పిడి ఇబ్బందులకు స్వస్తి పలుకుతూ.. తొలిసారిగా భారత్, టర్కీ, గ్రీస్ దేశాలు క్రీ.పూ నుంచి 6 శతాబ్దాల మధ్య కాలంలో తొలి నాణేన్ని ప్రవేశపెట్టాయి. ఆనాటి భారతదేశంలో ఉన్న 16 జనపదాల్లోని (నదీ పరివాహక ప్రాంతాలు) అస్మక (గోదావరి పరివాహక ప్రాంతం) సరిహద్దుల్లో వెండితో తయారు చేసిన పంచ్మార్క్డ్ నాణేన్ని మగధ, మౌర్య (అశోకుడి కాలంలో) మొదటి నాణేన్ని వెండితో లిపి లేకుండా తయారు చేశారు.
లిపితో ముద్రించిన నాణేం..
క్రీ.పూ. 2వ శతాబ్దంలో కరీంనగర్ కోటి లింగాల కేంద్రంగా పాలించిన గోబడ (గోబద) లిపితో తయారు చేసిన నాణేలను ముద్రించారు. శాతవాహనులు రెండొంతుల భారతదేశాన్ని పాలించారని, వారి జన్మస్థానం కరీంనగర్ కోటిలింగాలుగా నాణేల ఆధారంగా చర్రితకారులు గుర్తించారు. వీరి తరం నుంచే నాణేంపై బొమ్మను ముద్రించడం ప్రారంభమైంది.
ఇనుప నాణేలు..
ఇక్షాకుల పాలనలో ఇనుప నాణేలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. తూర్పు దేశంలో బౌద్ధ మతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన పల్లవులు సైతం తెలుగు వారేనని, బోధిధర్ముడి ఆనవాళ్లు కూడా ఇక్కడే ఉన్నట్లు గుర్తించారు. వీరికి సంబంధించిన నాణేలు ప్రదర్శనలో ఉంచారు.
తెలుగు వారి ఘనతే…
దక్షిణ భారతదేశంలో బంగారు నాణేలను ప్రవేశపెట్టింది తెలుగు చాళుక్కులే. వీరు మొదటి సారిగా బంగారంతో తయారు చేసిన నాణేలపై వరాహాని ముద్రించారు.
కాకతీయుల పాలనలో..
కాకతీయుల పాలనలో సైతం బంగారు నాణేలు కొనసాగాయి. వరాహాం ముద్రతో పాటు దాని పక్కనే రుద్రమ దేవి, ప్రతాప దేవుడు బిరుదులను తెలియజేసేలా దయ గజ కేసరి, రయ గజ కేసరి అని ఆనాటి తెలుగులో రాసి ఉండేది. అలాగే బంగారంతో తయారు చేసిన నాణేలపై లెంక అని రాసి ఉన్న వాటిని వారి కాలంలో అందుబాటులో ఉంచారు.
నాణేల సేకరణ ఓ వ్యాపకం
ఎలక్ట్రికల్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్నా. నాణేలు, శిలాజాలు, ఖనిజాల సేకరణ ఓ వ్యాపకం. క్రీ.పూ 8వ శతాబ్దం నుంచి నిజాం కాలం వరకు అన్ని నాణేలను సేకరించాను. భవిష్యత్తరాలకు నాణేల గొప్పదనం, వాటి వివరాలను వెల్లడించేందుకు ఈ ప్రదర్శన ఓ వేదికలా నిలుస్తుంది. దీంతో పాటు అంతరించిపోతున్న బ్రహ్మీ లిపిని చదవడం నేర్చుకున్నా. ప్రదర్శనలో 1200+ నాణేలను సందర్శకుల కోసం ఉంచాను.
– కందుల వెంకటేశ్