చార్మినార్, జూలై 5: కస్టమర్ సర్వీస్ సెంటర్ పేరుతో ఆధార్ కార్డులో పేర్లు మార్పులు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న నిందితులను కాలాపత్తర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. అన్సారీరోడ్డు ప్రాంతంలో నివాసముండే సయ్యద్ సయీద్ (33) యూనిక్ కస్టమర్ సర్వీస్ సెంటర్ పేరుతో అన్లైన్ సేవలను అందిస్తున్నాడు. వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో అక్రమంగా సంపాదించాలని నిర్ణయించుకొని స్నేహితులకు చెప్పి తనకు సహకరించాలని కోరాడు. సికింద్రాబాద్ ప్రాంతంలోని కరూర్ వైశ్యాబ్యాంక్లో ఆధార్ కార్డు అప్డేట్ ఆపరేటర్గా పనిచేస్తున్న రెహయన్ అహ్మద్ సిద్దిఖీ అలియాస్ అబ్రర్ (23) అతడితో చేతులు కలిపాడు. బ్యాంకు విధులు ముగిసిన తర్వాత బ్యాంకుకు చెందిన ల్యాప్టాప్ను తీసుకువచ్చి యూనిక్ కస్టమర్ సర్వీస్ సెంటర్లో ఆధార్ కార్డులో పేర్లు మార్పులు చేస్తూ అధిక డబ్బులు వసూలు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోసులు సర్వీస్ సెంటర్పై మంగళవారం దాడులు నిర్వహించి ప్రధాన నిందితుడు అహ్మద్ సిద్ధిఖీ, సయ్యద్ సయీద్, యూసుఫ్ ఖాన్ (40), జోహెబ్ (18)లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి ల్యాప్టాప్, ఐరిస్ స్కానర్స్, వెబ్ కెమెరా, స్లాప్ జీపీఎస్, నాలుగు సెల్ఫోన్లు, 99 మంది ఆధార్ కార్డులు, 10 ఖాళీ ఆధార్ కార్డుల పత్రాలు, 200 పీవీసీ కార్డులు, రబ్బర్స్టాంప్, 6 వేల నగదు, 5 ఫింగర్ ప్రింట్ స్కానర్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు సీఐ విక్రంసింగ్, ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.