గోల్నాక, జూలై 4 : వర్షాకాలం నేపథ్యంలో అధికారు లు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. వరద నీరు సజావుగా వెళ్లేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు కలుషిత తాగునీరు సరఫరా కాకుండా ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. సోమవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జలమండలి జీఎం శ్రీధర్రెడ్డితో పాటు అధికారులతో ఆయన విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న మంచినీటి, డ్రైనీజీ పైపులైన్ల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసికొని నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు కొత్త అభివృద్ధి పనులను ప్రణాళికా బద్ధంగా చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు.
దీంతో అంబర్పేట, బాగ్అంబర్పేట, గోల్నాక, నల్లకుంట, కాచిగూడ డివిజన్లలో కొత్తగా ప్రతిపాధించిన పనుల నిర్మాణానికి అనుమతులు లభించిన వెంటనే అంచనా వ్యయాన్ని సిద్ధం చేయాలని అన్నారు. అంతే కాకుండా పనులు చేపడుతున్న సమయంలో ప్రజలకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇక భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డ్రైనేజీ, మంచినీటి పైపులైన్ల వ్యవస్థను ఆధునీకరించాలని అన్నారు. ప్రస్తుతం మంచినీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమస్యల పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సమావేశంలో జలమండలి అధికారులు విష్ణువర్ధన్రావు, సన్యాసిరావు, భావన, కుశాల్, రోహిత్, షఖీర్, అశ్వక్ తదితరులు పాల్గొన్నారు.
మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలి ..
ప్రకృతిని కాపాడలంటే మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించి పూజించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పిలుపు నిచ్చారు. సోమవారం అంబర్పేట డివిజన్ నరేంద్రనగర్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ ఇ. విజయ్కుమార్గౌడ్తో కలిసి ఆయన హాజరై స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడు వినాయక చవితికి ప్రజలు మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సిబ్బంది విజయ్కుమార్, పాష, శ్రీనివాస్, విజయ్భాస్కర్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ్ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.