సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): వారం రోజులుగా కురుస్తున్న వానలతో గ్రేటర్లో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. మలేరియా, డెంగీ వంటి కేసులు అదుపులోనే ఉన్నా.. సాధారణ జ్వరం, జలుబు, దగ్గు వంటి వైరల్ ఫీవర్, ఫ్లూ వంటి కేసులు మాత్రం పెరుగుతున్నాయి. వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. వర్షాకాలం, చలికాలంలో వైరల్ ఫీవర్లు రావడం సహజమేనని, ముఖ్యంగా వేసవి ముగిసిన తర్వాత వర్షాలు కురుస్తూ ఒక్కసారిగా వాతావరణం మారడంతో వైరల్ ఫీవర్స్ వంటి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
పెరుగుతున్న ఓపీ…
గత వారం రోజులుగా గ్రేటర్లోని బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా దవాఖానలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా దవాఖానల్లో ఓపీ రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఏప్రిల్, మే నెలలో పదుల సంఖ్యలో ఉన్న ఓపీ జూన్ మాసంలో స్వల్పంగా పెరగగా.. గడిచిన వారం రోజులుగా ఓపీ సంఖ్య 10నుంచి 15శాతం పెరిగినట్లు చెబుతున్నారు. బస్తీ దవాఖానలో మొన్నటి వరకు రోజుకు 30 నుంచి 40 వరకు ఉన్న ఓపీ.. గత వారం రోజులుగా 50 నుంచి 60కి చేరిందని, మరికొన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ 100కు చేరినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఓపీ కేసుల్లో అత్యధికంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ సీజనల్ వ్యాధులే అధికంగా కనిపిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
జాగ్రత్తలు తప్పనిసరి..
ఇప్పుడిప్పుడే వానలు కురుస్తుండటంతో వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు రావడం సహజం. వీటి నివారణకు ముందస్తుగానే ప్రత్యేక ప్రణాళికను రూపొందించాం. జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో కలిసి వైద్య, ఆరోగ్యశాఖ సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు పలు చర్యలు చేపడుతున్నాం. బస్తీ దవాఖాన దగ్గర నుంచి జిల్లా దవాఖాన, ట్రెషరీ దవాఖాన వరకు ప్రతి ఆరోగ్య కేంద్రంలో వైద్యపరీక్షలు చేస్తున్నాం. అవసరమైన మందులన్నీ దవాఖానల్లోనే ఇస్తున్నాం. ప్రాథమిక స్థాయిలో తగ్గని వ్యాధిగ్రస్తులను సెకండరీ లేదా ట్రెషరీ దవాఖానలకు సిఫారసు చేసే విధంగా ప్రాణాళిక రూపొందించాం. ఈ మధ్య నమోదైన డెంగీ కేసులు ప్రస్తుతం అదుపులోకి వచ్చాయి. మలేరియా కేసులు పెద్దగా లేవు. సాధారణ జలుబు, దగ్గు, జ్వరం వంటి వైరల్ ఫీవర్స్, ఫ్లూ వంటివి వానల కారణంగా పెరుగుతున్నాయి.
–డాక్టర్ జె.వెంకటి, హైదరాబాద్ జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి