సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ) : మన్నిక ఎక్కువగా ఉండేలా.. చూడ చక్కనైన రోడ్లతో గ్రేటర్ ముఖచిత్రం మారిపోయింది. గుంతల సమస్యలు లేకుండా కొత్త టెక్నాలజీతో చేపడుతున్న రహదారులతో నగరంలో ప్రయాణం సాఫీగా సాగిపోతున్నది. రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న బల్దియా.. ప్రధాన రోడ్లతో పాటుగా అంతర్గత రహదారులను మెరుగుపర్చుతున్నది. సీసీ రోడ్లతో పాటు నూతన టెక్నాలజీతో చేపడుతున్న వీడీసీసీ (వాక్యూమ్ డీ వాటరింగ్ సిమెంట్ కాంక్రీట్) రోడ్డు పనులను ముమ్మరంగా చేపడుతున్నారు. ఎంతో పటిష్టంగా ఉండటంతోపాటు ఎక్కువ కాలం మన్నిగా ఉండటమే ఈ రోడ్ల ప్రత్యేకత.
జోన్ల వారీగా మంజూరైన, చేపట్టిన పనులు..
ఎల్బీనగర్ జోన్: రూ.14.71 కోట్ల విలువ గల 37 పనుల్లో భాగంగా 17.11 కిలోమీటర్ల రోడ్డు చేపట్టేందుకు నిర్ణయం. అందులో 4 పనులు పూర్తి కాగా, 13 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకా 16 చోట్ల పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
చార్మినార్ జోన్ : రూ.29.72 కోట్లతో 61 పనులు మంజూరు చేశారు. 6 పనులు పూర్తి కాగా 9 పురోగతిలో ఉన్నాయి. 33 చోట్ల ప్రారంభ దశలో, 13 టెండర్ దశలో ఉన్నాయి.
ఖైరతాబాద్ జోన్ : రూ.40.74 కోట్ల విలువైన 146 పనులతో 31.34 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం లక్ష్యం కాగా.. అందులో 7 పనులు పూర్తయ్యాయి. 26 పనులు అభివృద్ధి దశలో, 96 పనులు ప్రారంభ దశలో మరో 12 పనులు టెండర్ దశలో ఉన్నాయి.
శేరిలింగంపల్లి జోన్ : రూ.6.43 కోట్ల అంచనా వ్యయంతో 10 పనుల్లో భాగంగా 5.17 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం. 4 పనులు పూర్తి కాగా, 2 అభివృద్ధి దశలో ఉన్నాయి.
కూకట్ పల్లి జోన్ : రూ.11.36 కోట్ల వ్యయంతో 13.03 కిలోమీటర్ల దూరానికి 35 పనులు మంజూరు. అందులో 3 పనులు పూర్తి కాగా, 4 అభివృద్ధి దశలో, మరో 27 ప్రారంభ దశలో ఉన్నాయి.
సికింద్రాబాద్ జోన్ : రూ.55.69 కోట్ల విలువ గల 159 పనుల్లో భాగంగా 40.96 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాలకు నిర్ణయం. ఇందులో 5 పనులు పూర్తి కాగా, 11 పనులు ప్రగతి దశలో, 67 పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. మరో 68 టెండర్ దశలో ఉన్నాయి. 8 చోట్ల పనులను వివిధ కారణాలతో నిలిపివేశారు.