ఆగి ఉన్న లారీని ఢీకొని ముగ్గురు మృతి
వాహనాలు ఢీకొని మరో ఇద్దరు..
కంటైనర్ ఢీకొని భార్య దుర్మరణం..భర్తకు తీవ్ర గాయాలు
శంషాబాద్ రూరల్/పీర్జాదిగూడ, జూలై 4 : రహదారులు రక్తమోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఆగిఉన్న లారీని కారు ఢీకొ న్న ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడగా.. టాటా ఏస్ ఢీకొని రోడ్డు దాటుతున్న మహిళ, ఆయిల్ ట్యాంకర్ బైక్ను ఢీకొన్న ఘటనలో మరో వ్యక్తి మృతి చెందా రు.
రోడ్డు దాటుతుండగా మహిళ…
బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో నివాసం ఉంటున్న బిజివేముల రవికుమార్ భార్య కౌసల్య (35) మేడిపల్లిలోని డీమార్ట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో ఇంటి నుంచి డ్యూటీకి వెళ్తూ మేడిపల్లి వద్ద రోడ్డు దాటుతుండగా ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. స్థానికులు ఆమెను ప్రైవేటు దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డుపై లారీ ఆపడంతో…
శంషాబాద్ మండలం పెద్దగోల్కొండ సమీపంలోని ఓఆర్ఆర్పై సోమవారం నిబంధనలకు విరుద్ధంగా టీఎస్07 యూహెచ్ 6201 నంబర్ గల లారీని నిలిపి ఉంచారు. శ్రీశైలం నుంచి వస్తున్న ఎంహెచ్ 21వీ 0247 నంబర్ గల కారు.. అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో అందులో ఉన్న సందీప్, ఆనంద్ నాందేవ్, రంగనాథ్ దాదవ్ అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులు మహారాష్ట్రకు చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించామని.. పూర్తి వివరాలు తెలుసుకుంటున్నామని సీఐ శ్రీధర్ తెలిపారు.
ఆయిల్ ట్యాంకర్ ఢీకొని వ్యక్తి…
మేడిపల్లి మారుతినగర్ కాలనీకి చెందిన ఎడ్ల నర్సిరెడ్డి (58) స్నేహితుడు గోపాల్రెడ్డితో కలిసి బైక్పై చెంగిచెర్ల వైపు బయల్దేరాడు. పూసల గోదాం సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ బైక్ను ఢీకొట్టడంతో నర్సిరెడ్డి కిందపడి తలకు తీవ్ర గాయాలై మృతిచెందాడు. మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కొడుకు వద్దకు వచ్చి తిరిగి వెళ్తుండగా..
మేడ్చల్ రూరల్, జూలై 8 : రోడ్డు ప్రమాదంలో భార్య మృతిచెందగా, భర్తకు తీవ్ర గాయాలైన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ రాజశేఖర్ రెడ్డి కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సింగారం గ్రామానికి చెందిన కన్నెగుల్ల శ్రీనివాసులు, తన భార్య రాజేశ్వరీ(52)తో కలిసి నగరంలోని హఫీజ్పేటలో ఉండే తన కొడుకు వద్దకు వచ్చారు. తిరిగి సోమవారం ఉదయం హఫీజ్పేట నుంచి ద్విచక్రవాహనంపై సింగారం గ్రామానికి బయలుదేరారు. గండిమైసమ్మ నుంచి శామీర్పేట వెళ్తుండగా మార్గమధ్యలోని మేడ్చల్ పారిశ్రామిక ప్రాంత కూడలి వద్ద రింగురోడ్డు దిగి నిజామాబాద్ వెళ్తున్న హర్యానాకు చెందిన కంటైనర్ వారి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో రాజేశ్వరీ అక్కడికక్కడే మృతిచెందగా శ్రీనివాసులు కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, గాయపడిన శ్రీనివాసులును దవాఖానకు తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.