సిటీబ్యూరో, జూలై 2(నమస్తే తెలంగాణ)/మాదాపూర్: ప్రధాని మోదీ నగర పర్యటన నేపథ్యంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్యంలో పోలీసులు అత్యాధునిక సాంకేతికతతో భారీ భద్రత కల్పిస్తున్నారు. హెచ్ఐసీసీలో శనివారం నుంచి ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పలువురు వీఐపీలు హాజరైన సందర్భంగా ఆ ప్రదేశంతో పాటు చుట్టూ.. ఐదు కిలోమీటర్ల పరిధిని మూడు రోజుల ముందే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పరిసరాలు, వేదికలను పోలీసులు త్రీ-డీ మ్యాపింగ్ చేశారు. ప్రతి అణువూ స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకున్నారు.
ఇక సోషల్ మీడియాలో రోజుకు లక్షలాది పోస్టులను జల్లెడ పట్టారు. త్రీ-డీ మ్యాపింగ్తో ఎక్కడ ఎంత మంది సిబ్బందిని పెట్టాలి.. ఏ విభాగాన్ని ఎక్కడ మోహరించాలి వంటి ప్రణాళికలను రూపొందించి వారందరికీ ప్రాంతాలను కేటాయించారు. కమాండ్ కంట్రోల్లో దాదాపు ఒకే సారి 200 కెమెరాల దృశ్యాలను చూసేలా బాహుబలి స్క్రీన్ను ఏర్పాటు చేసి అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటున్నారు సైబరాబాద్ పోలీసులు. మరోవైపు హెచ్ఐసీసీ, హైటెక్స్ ప్రాంగణం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎస్పీజీ, ఉన్నతాధికారుల ఆదేశానుసారం న్యాక్ ప్రధాన ద్వారం వద్ద వచ్చిపోయే వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సమావేశ ప్రాంగణంలోకి వెళ్లేవారి పాస్లను తనిఖీ చేసి.. లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.
పరేడ్మైదానంలో బీజేపీ బహిరంగ సభ
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఆదివారం జరిగే బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీసు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ ఆంక్షలు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు అమల్లో ఉంటాయన్నారు. హెచ్ఐసీసీ-మాదాపూర్-జూబ్లీహిల్స్-చెక్ పోస్టు-కేబీఆర్ పార్క్-పంజాగుట్ట-గ్రీన్ ల్యాండ్స్ – బేగంపేట్-పరేడ్ గ్రౌండ్, టీవోలీ క్రాసు రోడ్డు-ప్లాజా ఎక్స్ రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నట్లు చెప్పారు.
ట్రాఫిక్ ఆంక్షల్లో కొన్ని ముఖ్యమైనవి..
పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లే వారు పంజాగుట్ట-ఖైరతాబాద్ జంక్షన్-లోయర్ ట్యాంక్బండ్-గాంధీ దవాఖాన-చిలకలగూడ క్రాసు రోడ్డు ప్లాట్ఫాం నం.10 నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి వెళ్లాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాట్నీ-ప్యారడైజ్-బేగంపేట-పంజాగుట్ట మార్గం వైపు వెళ్లొద్దు. నగరం నుంచి కరీంనగర్ వెళ్లే వారు తిరుమలగిరి-జేబీఎస్ మార్గాన్ని వాడొద్దు. ఓఆర్ఆర్ను ఉపయోగించుకోవాలి.
యాదమ్మ వంటకాలు …
ప్రధాని నరేంద్ర మోదీతో పాటు 500 మందికి 25 రకాల వంటకాలను యాదమ్మ చేతుల మీదుగా స్వయంగా తయారు చేసేలా ఏర్పాట్లు చేశారు. గోంగూర, మామిడికాయ పప్పు, పాలకూర పప్పు, టమాట, ఆలు కుర్మ, ముద్దపప్పు, తోటకూర ఫ్రైతో పాటు పిండి వంటలను ప్రధాని మోదీ కోసం ప్రత్యేకించి సిద్ధం చేసినట్లు యాదమ్మ తెలిపారు.