సిటీబ్యూరో, జూలై 1(నమస్తే తెలంగాణ);దూర ప్రాంతాలను దగ్గర చేయడం, ప్రధాన మార్గాలపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతోపాటు విలువైన సమయాన్ని ఆదా చేసేందుకు హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) లింకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నది. గ్రేటర్వ్యాప్తంగా 126.20 కిలోమీటర్ల మేర లింకు రోడ్లు నిర్మించాలని లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటివరకు 21 చోట్ల 24 కి.మీ.అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం రూ.273.55 కోట్లు వెచ్చించింది. మరో 8 చోట్ల పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన లింకు రోడ్ల ద్వారా ప్రజలకు ఏ మేర ప్రయోజనం చేకూరింది ? ప్రధాన రహదారులపై ఎంత ట్రాఫిక్ ఒత్తిడి తగ్గింది? తదితర ప్రయోజనాలపై శాస్త్రీయ సర్వే నిర్వహించాలని శుక్రవారం జరిగిన సమీక్షలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. పలుచోట్ల పురోగతిలో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.