బంజారాహిల్స్/ తెలుగుయూనివర్సిటీ / కవాడిగూడ / బేగంపేట్/ మారేడుపల్లి/ కూకట్పల్లి / సుల్తాన్బజార్, జూలై 1 : భక్తుల నీరాజనాలు.. యువత కోలాటాలు.. కళాకారుల ప్రదర్శనల నడుమ శుక్రవారం నగరంలో పలుచోట్ల జగన్నాథుడి రథయాత్ర శోభాయమానంగా సాగింది. అందంగా అలంకృతుడైన జగన్నాథుడికి ఇరువైపులా బలరాముడు, సుభద్రాదేవి కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. రథాలను విభిన్న పూలతో ఆకర్షణీయంగా అలంకరించారు.
భక్తుల జయజయ ధ్వానాలు.. యువతీయువకుల కోలాటలు, భజనలతో జగన్నాథ రథయాత్ర శుక్రవారం కోలాహలంగా సాగింది. తెల్లవారుజామున జగన్నాథుడు, భలభద్రుడు, సుభద్రల విగ్రహాలను అర్చకులు రథాల మీదకు చేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు. హరే రామ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ.. నామస్మరణతో నగర రోడ్లన్నీ మార్మోగాయి. మహిళలు రోడ్లను ఊడ్చి, ముగ్గులు వేసి పూలతో రథయాత్రకు స్వాగతం పలికారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
బంజారాహిల్స్ రోడ్ నం.12లోని జగన్నాథ మందిరం నుంచి సాగిన యాత్రలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.హైదరాబాద్ ఇస్కాన్ దేవాలయం మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద జగన్నాథ రథయాత్రను కమిటీ సభ్యులు రాధేశ్యామ్ దాస్, వరదకృష్ణ దాస్, వేదాంత చైతన్యదాస్, సీతారామ్దాస్, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన జీయర్ స్వామి ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభమైన రథయాత్ర భక్తుల కోలాహలం మధ్య ధర్నాచౌక్, ఇందిరాపార్కు, అశోక్నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, నారాయణగూడ, హిమాయత్ నగర్ లిబర్టీ, బషీర్బాగ్ చౌరస్తా, అబిడ్స్, ఇస్కాన్ టెంపుల్ మీదుగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్ ప్రాంగణంలోని తెలుగు లలిత కళాతోరణం వరకు సాగింది. ఈ యాత్రలో సుమారు 12 వేలకు పైగా భక్తులు పాల్గొని జగన్నాథుడి ఆశీర్వచనాలను అందుకున్నారు.
సికింద్రాబాద్ ఇస్కాన్ ఆలయం నుంచి ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర ఎస్పీరోడ్, ప్యాట్నీ సెంటర్, ఆర్పీరోడ్, బాటా, మోండా మార్కెట్, అల్ఫా హోటల్ నుంచి సెయింట్ మెరీస్ రోడ్డు, సంగీత్ మీదుగా తిరిగి దేవాలయంకు చేరుకుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న, జీహెచ్ఎంసీ మాజీ కో ఆప్షన్ సభ్యుడు నర్సింహ ముదిరాజ్, పిట్ల నాగేశ్ ముదిరాజ్, సదానంద్, నారాయణ తదితరులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
సికింద్రాబాద్ జనరల్ బజార్లో శ్రీ జగన్నాథస్వామి రథయాత్ర కోలాహలంగా సాగింది. జనరల్ బజార్, ఎంజీ రోడ్డు, హిల్స్ట్రీట్, రాణిగంజ్ మీదుగా ఈ రథయాత్ర కొనసాగింది.