బన్సీలాల్పేట్/ సుల్తాన్ బజార్ జూలై 1: కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి లక్షలాది మందికి పునర్జన్మ ప్రసాదించిన వైద్యులు తమ వైద్య వృత్తికే వన్నె తెచ్చారని పలువురు వక్తలు కొనియాడారు. గాంధీ అలూమ్ని అసోసియేషన్, గాంధీ వైద్య కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ‘నేషనల్ డాక్టర్స్ డే’ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సంపత్రావు, డాక్టర్ సాయి కుమార్, గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు ముఖ్య అతిథులుగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. 41 మంది వైద్య విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 60 మంది వైద్య విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు.
నూతనంగా చేరిన 250 మంది వైద్య విద్యార్థులకు యాప్రాన్లను అందజేశారు. మరోవైపు జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో 200 మంది యువ డాక్టర్లు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో గాంధీ అలూమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జీఆర్ లింగమూర్తి, గాంధీ డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ నర్సింహారావు నేత, శోభన్బాబు, టీజీడీఏ అధ్యక్షుడు డాక్టర్ రాజేశ్వర్ రావు, ఆర్ఎంఓ డాక్టర్ జయకృష్ణ, బ్లడ్బ్యాంక్ ఇన్చార్జి డాక్టర్ సత్యరత్న, జూడా అధ్యక్షుడు డాక్టర్ కార్తిక్, ప్రతినిధులు డాక్టర్ లింగయ్య, ప్రతాప్రెడ్డి, చంద్రశేఖర్, రాజారెడ్డి, నాగభూషణం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్స్ డేను పురస్కరించుకొని ఉస్మానియా డాక్టర్లకు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ శుభాకాంక్షలు తెలుపడంతో పాటు పుష్పగుచ్ఛం అందజేశారు.
v టీఎస్ ఆర్టీసీ తార్నాక వైద్యశాలలో నిర్వహించిన డాక్టర్స్ డే వేడుకల్లో టీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలపడంతో పాటు వైద్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తార్నాక ఆసుపత్రి ఓఎస్డీ డాక్టర్ వీఎన్రెడ్డి, చీఫ్ పర్సనల్ మేనేజర్ యుగంధర్, సూపరింటెండెంట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్.శైలజామూర్తి పాల్గొన్నారు.
డాక్టర్స్ డేను పురస్కరించుకుని ఆజాదీకా అమృత్లో భాగంగా ఉత్తమ వైద్య సేవలందించిన పలువురు వైద్యులను ఆరోగ్యశ్రీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.ఎ.ఎం రిజ్వి ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ (నిమ్స్) సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ బీరప్పను సన్మానించి, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. గ్యాస్ట్రోకు సంబంధించి పలు అరుదైన శస్త్ర చికిత్సలు, కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా చేస్తూ దేశ వ్యాప్తంగా నిమ్స్కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నందుకు గానూ డాక్టర్ బీరప్పను ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపుతో సన్మానించింది.
ఢిల్లీలో ఆయుష్ విభాగంలో రెసిడెంట్ మెడికల్ సూపరింటెండెంట్గా సేవలందిస్తున్న నగరానికి చెందిన డాక్టర్ ఆనంద్ కుమార్కు ఉత్తమ సేవా ప్రశంసాపత్రం అందజేశారు. కొవిడ్ నివారణలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాల ద్వారా ఎంతో మందిని ఆదుకున్నందుకు ఐఏఎస్ అధికారి శశాంక అల చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఘనశ్యాం, శ్రీనివాస్, అనిల్, ఈసీ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ ధన్యవాదాలు తెలియజేశారు.